గుడ్న్యూస్, ఎంఎస్ఎంఈలకు రుణ హామీ పథకం పొడిగింపు
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సంస్థలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.21 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రయోజనాలు కల్పించింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం కింద కంపెనీలకు ప్రభుత్వ హామీతో కూడిన రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాల లక్ష్యం రూ.3 లక్షల కోట్లు. దీనిని కేంద్ర ప్రభుత్వం తాజాగా నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.
రూ.3 లక్షల కోట్ల రుణ హామీ లక్ష్యం నెరవేరకపోవడంతో దీనిని పొడిగించారు. వాస్తవానికి అక్టోబర్ 31వ తేదీతో ఈ గడువు ముగిసింది. ఇప్పుడు ఈ గడువును రూ.3 లక్షల కోట్ల లక్ష్యం చేరుకునే వరకు లేదా నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఏది ముందయితే అంతవరకు ఈ స్కీం గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది.
ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి, వ్యవస్థలో డిమాండ్ పుంజుకుంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఈ పథకం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించింది కేంద్రం. దీంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.