భారీగా పెరిగిన బంగారం ధరలు, రూ.49,000 దిశగా గోల్డ్ ఫ్యూచర్స్
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో మళ్లీ రూ.49,000 దిశగా పరుగు పెడుతోంది. ఓ వైపు కేంద్ర బడ్జెట్కు ముందు ఈక్విటీ మార్కెట్ కుప్పకూలుతుండగా, మరోవైపు పసిడి ధరలు మాత్రం పైపైకి కదులుతున్నాయి. మార్కెట్ గత ఐదు రోజులుగా భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ ఈ కాలంలో ఏకంగా 3500 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇదే కాలంలో బంగారం ధరలు దాదాపు రూ.600 వరకు పెరిగాయి.
పసిడి ధరలు గతవారం రూ.300కి పైగా ఎగిశాయి. నేడు మరో రూ.250 పెరిగింది. ఎంసీఎక్స్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.250 పెరిగి రూ.48,499 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.206 పెరిగి రూ.48,490 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7800 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.30 డాలర్లు లాభపడి 1835 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు ఓ సమయంలో 14 డాలర్ల వరకు ఎగిసి 1844.75 డాలర్లకు చేరుకుంది. 1850 డాలర్ల దిశగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత కాస్త చల్లబడింది. రూపాయి బలహీనత కూడా దేశీయంగా ధరలు మరింత పెరగడానికి కారణమయ్యాయి.
గతవారం ఎగిసిపడిన వెండి ధరలు ఈ వారం ప్రారంభ సెషన్లో కాస్త చల్లబడ్డాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.456 పెరిగి రూ.64,350 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.388 ఎగిసి రూ.65,046 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.0.490 డాలర్లు నష్టపోయి 23.828 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.