ఈక్విటీ నిధుల సేకరణ సహా...: బాంబే స్టాక్ ఎక్స్చేంజీతో తెలంగాణ ప్రభుత్వం జట్టు
హైదరాబాద్: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(BSE)తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. MSMEలు స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదయ్యేలా ప్రోత్సహించడం కోసం, రుణ అవసరాలను తీర్చే లక్ష్యంలో భాగంగా చేతులు కలిపాయి. MSME మంత్రిత్వ శాఖ 2019-20 వార్షిక నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 26.05 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇందులో 25.94 లక్షలు మైక్రో ఎంటర్ప్రైజెస్ కాగా, 10,000 వరకు స్మాల్ యూనిట్లు, 1,000 వరకు మీడియం యూనిట్లు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ కంపెనీల వ్యాపారం పెంపు లక్ష్యంగా పని చేస్తోన్న గ్లోబల్ లింకర్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా బీఎస్ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సీఎల్, మైండ్ ట్రీ... ఐటీ ఉద్యోగులకు ముందే పండుగ వచ్చింది!
ఎంఎస్ఎంఈలకు ఇలా సహకారం
ఆర్థిక వనరుల లభ్యత, మూలధన అవసరాలు తీర్చుకునేలా ప్రోత్సాహకం, కంపెనీల విశ్వసనీయతను పెంచే కీలక సవాళ్ళను పరిష్కరించేలా ఒప్పందం దోహదం చేయనుంది. లిస్టింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి కంపెనీలకు అవగాహన కల్పించేలా బీఎస్ఈ సాయం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల లభ్యత ఎంఎస్ఎంఈలకు పరిమితంగా ఉంది. కంపెనీలు ప్రధానంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఒప్పందం ద్వారా విస్తరణ మొదలు కొనుగోళ్లస్థాయికి వ్యాపారం ఎదిగేందుకు ఎంఎస్ఎంఈలకు నిధుల సమీకరణకు తోడ్పాటు లభిస్తుంది. క్రెడిబిలిటీని పెంచుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సూచనలు చేస్తుంది. స్టాక్ ఎక్స్చేంజీలో తెలంగాణ నుండి కొన్ని ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలో పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు.
అభివృద్ధిలో కీలక పాత్ర
ఈ భాగస్వామ్యంతో వ్యాపార కార్యకలాపాల విస్తరణ, ఇతర సంస్థల కొనుగోలుకు అవసరమైన నిధులను మార్కెట్ నుంచి ఇక్కడి MSMEలు సమీకరించగలవని బీఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అలాగే పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తున్నాయన్నారు. స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయడం వల్ల కలిగే లాభాలను, ఇందుకు అవసరమైన సాంకేతికత, మానవవనరులను బీఎస్ఈ సమకూర్చుతుంది.
330 ఎంఎస్ఈలు లిస్ట్..
చిన్న పరిశ్రమల వ్యాపారవృద్ధి కోసం, వ్యాపారాలను డిజిటలైజ్ చేయడం కోసం అండగా ఉండేందుకు తెలంగాణ పరిశ్రమ విభాగం 2019 గ్లోబల్ లింకర్ పోర్టల్ను ప్రారంభించింది. ఇందుకు గ్లోల్ లింకర్ సంస్థతో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా 6.33 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇందులో 330 ఎస్ఎంఈలు బీఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. ఈ కంపెనీలు సంయుక్తంగా రూ.3,340.36 కోట్లు సమీకరించాయి.