పే వన్ థర్డ్ కార్డ్, మూడు నెలల వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ UNI పలు రకాల క్రెడిట్ కార్డ్స్ను ప్రవేశ పెడుతోంది. తాజాగా పే వన్ థర్డ్ అనే సరికొత్త కార్డును తీసుకు వచ్చింది. దీనిని పే ల్యాటర్ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఈ తరహా కార్డును భారత్లో విడుదల చేయడం ఇదే మొదటిసారి. భారత్లో అత్యధిక కాలం వడ్డీ రహిత నగదు సదుపాయాన్ని అందిస్తున్న కార్డుగా దీనిని పేర్కొంటున్నారు. ఈ కార్డు ద్వారా చేసే ఖర్చును మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక్కో భాగాన్ని ఒక్కో నెల చొప్పున మూడు నెలల వరకు చెల్లించవచ్చు. దీనిపై ఎలాంటి వడ్డీ విధించరు. స్వల్పకాలంలో డబ్బులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్డును తీసుకు వచ్చారు. కావాలనుకుంటే కస్టమర్లు మూడు భాగాలను ఒకేసారి చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. అలా చేస్తే ఒక శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
ప్రస్తుత ఈ పే వన్ థర్డ్ కార్డును జూన్ నెలలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకు వచ్చారు. రెండు నెలల్లోనే పదివేల మంది కస్టమర్లు దీనిని తీసుకున్నారు. ఈ కార్డు సేవలను మరింత విస్తరించే ఉద్దేశ్యంలో భాగంగా వచ్చే ఏడాది కాలంలో పది లక్షల కస్టమర్లకు చేరుకోవాలని భావిస్తున్నారు. ఈ కార్డును హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలో అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డును కస్టమర్లకు మరింత చేరువ చేసే లక్ష్యంతో దీనిని తీసుకు వచ్చారు. క్రెడిట్ కార్డు వినియోగం పెంచడానికి చెల్లింపు వ్యవధిని మూడు నెలలకు పెంచడమే సరైన పరిష్కార మార్గమని చెబుతున్నారు.
కస్టమర్లకు పే వన్ థర్డ్ కార్డును ఓ జీవనశైలి కార్డుగా మార్చే దిశగా సాగుతున్నట్లు తెలిపారు. ఎలాంటి రహస్య ఛార్జీలు ఉండవని చెబుతున్నారు. యుని పే వన్ థర్డ్ కార్డును తీసుకునే వారి నుండి ప్రస్తుతం ఎలాంటి ప్రవేశ, వార్షిక ఛార్జీలు లేవని చెబుతున్నారు. పే వన్ థర్డ్ యాప్ ద్వారా మన ఖర్చుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే చెల్లింపు తేదీ దగ్గరపడుతున్న సమయంలో మెసేజ్ వస్తుంది. ఈ కార్డును వీసా కార్డు మద్దతుతో తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డును వీసా కార్డులకు అనుమతి ఉండే ప్రతిచోట ఉపయోగించవచ్చు. ఫుడ్, గ్రాసరీస్, ఈ-కామర్స్ సహా పీవోఎస్ అందుబాటులో ఉన్న ప్రతిచోట దీనిని ఉపయోగించవచ్చు.
త్వరలో ఈ కార్డులో దీర్ఘకాల ఈఎంఐ వసతి, డైరెక్ట్ బ్యాంకు ట్రాన్సుఫర్, స్కూల్ ఫీజు, రివార్డ్ పాయింట్స్ వంటి ఫీచర్స్ను తీసుకు వస్తామని, యూని తెలిపింది. ప్రస్తుతం యూని యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని పే వన్ థర్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇరవై అయిదేళ్ల నుండి అరవై ఏళ్ల మధ్య వయస్సు వారు ఇందుకు అర్హుల. ఐదు నుండి పది నిమిషాల్లో మీకు డిజిటల్ కార్డు అందుబాటులోకి వస్తుంది. ఫిజికల్ కార్డు పోస్టు ద్వారా పంపిస్తారు.