కార్డ్లెస్ నగదు ఉపసంహరణ, ఇది ఎలా ప్రయోజనం?
ఏటీఎం కేంద్రాల నుండి కార్డు లేకుండానే నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని బ్యాంకులను అనుమతించాలని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు మాత్రమే కార్డులెస్ ఉపసంహరణలను ఆఫర్ చేయడానికి అనుమతి ఉంది. ఇక నుండి యూపీఐ ఆధారంగా ఏటీఎం నెట్వర్క్ల్లో అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
కార్డ్స్ స్కిమ్మింగ్, క్లోనింగ్ తదితర మోసాలు అరికట్టేందుకు కార్డులెస్ ట్రాన్సాక్షన్స్ అవసరమని, వీటికి యూపీఐని ఉపయోగించడం ద్వారా ఖాతాదారు ఆథరైజేషన్ను బ్యాంకులు పొందుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించి NPCI, ఏటీఎం నెట్ వర్క్స్, బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేస్తుందన్నారు.
కార్డ్లెస్ ఉపసంహరణ
డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి ఇది దోహదపడుతుంది. కార్డ్లెస్ ఉపసంహరణ అంటే.. కస్టమర్ ఏ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించకుండానే ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకునే సౌకర్యం. అప్పుడు కార్డు లేకుండానే భారత్వ్యాప్తంగా 24X7 నగదును ఎక్కడైనా ఉపసంహరించుకునే సౌకర్యం ఉంటుంది.
ఇది కూడా సురక్షితం. ఏటీఎం కార్డు లేకుండానే తక్షణమే నగదును తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో మొబైల్ పిన్ మాత్రం ఉంటుంది. కార్డ్లెస్ నగదు ఉపసంహరణ వ్యవస్థ పనిని నిర్వహించడానికి యూపీఐ సౌకర్యాన్ని ఉపయోగిస్తుంది.
కార్డ్లెస్ క్యాష్ ఉపసంహరణ సౌకర్యం సెల్ఫ్ విత్డ్రా కోసం. చాలా బ్యాంకుల్లో ఈ సదుపాయం ప్రస్తుతానికి లేదు లేదా రోజువారీ ట్రాన్సాక్షన్ పరిమితి ఉంది. కార్డు హోల్డర్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ను ఉపయోగించవలసి ఉంటుంది.
కార్డ్లెస్ ఉపసంహరణ ఉన్న బ్యాంకులు
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల కార్డు హోల్డర్లు తమ డెబిట్ కార్డులు లేకుండానే నగదును తీసుకునే సౌకర్యం ఉంది.
ఎలా పని చేస్తుంది?
కార్డ్లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని సేవింగ్స్ ఖాతాదారులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రారంభించవచ్చు.
కార్డ్లెస్ నగదు ఉపసంహరణ ఏటీఎంలను ప్రారంభించాయి కొన్ని బ్యాంకులు. ఏటీఎం సెంటర్కు వెళ్లి అక్కడ మొబైల్ నెంబర్కు వచ్చిన కోడ్ ద్వారా నగదును తీసుకోవచ్చు. ఇలాంటి ట్రాన్సాక్షన్లను పలు బ్యాంకులు ప్రస్తుతం రూ.5,000 నుండి రూ.10,000కు పరిమితం చేశాయి. ఒక ఖాతాకు ఒకరోజులో ట్రాన్సాక్షన్ చేయగల గరిష్ట మొత్తంపై కూడా పరిమితి ఉంది.