ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!
ఈరోజు(సెప్టెంబర్ 18, శుక్రవారం) నుండి ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు చెందిన అన్ని ఏటీఎంలలో రూ.10,000 అంతకంటే ఎక్కువ నగదు తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారానే నగదును ఉపసంహరించుకోవచ్చు. అందుకే ఏటీఎం నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్తే కనుక మీ వెంట తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ను తీసుకువెళ్లాలి. ఎందుకంటే బ్యాంకు పంపించిన వన్ టైమ్ పాస్వర్డ్(OTP)ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ ఏటీఎంలలో ఈ రోజు నుండే వన్ టైమ్ పాస్వర్డ్ ఆధారిత ఉపసంహరణ అమలులోకి వస్తోంది.
కార్డు లేకుండా వాచీతో పేమెంట్స్ చేయండి: ఎలా పని చేస్తుంది, ధర ఎంత?
మొబైల్ లేకుంటే ట్రాన్సాక్షన్ రద్దు!
ఏటీఎంలో నగదు ఉపసంహరణలో భద్రతాస్థాయిని మరింత పెంచేందుకు ఎస్బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణను తీసుకు వచ్చింది. మోసగాళ్లు, అనధికార ఉపసంహరణల నుండి కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ ప్రమాదాల నుండి నివారించేందుకు ఎస్బీఐ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే రాత్రి ఎనిమిది గంటలనుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంది. ఇప్పుడు రోజంతా అందుబాటులోకి వస్తోంది. కాబట్టి రూ.10వేలు అంతకంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేయాలనుకుంటే ఓటీపీ కోసం మొబైల్ వెంట తీసుకు వెళ్లాలి. లేదంటే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది.
నగదు ఉపసంహరణ ఇలా..
- ఎస్బీఐ ఏటీఎం నుండి నగదు ఉపసంహరణకు ఓటీపీ తప్పనిసరి.
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ కేవలం ఒక ట్రాన్సాక్షన్ కోసం మాత్రమే పరిమితం అవుతుంది.
- ఏటీఎంకు వెళ్లి మీరు నగదు ఉపసంహరణ కోసం మీరు తీసుకునే మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత, ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ పేజీ డిస్ప్లే అవుతుంది.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
- అనధికార ఏటీఎం ఉపసంహరణ నుండి ఇది రక్షిస్తుంది.
- నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (NFS)లోని ఎస్బీయేతర ఏటీఎంలలో దీనిని ఇంకా డెవలప్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ సౌకర్యం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఉంది.
ఎప్పటికప్పుడు జాగ్రత్తలు
డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుకు సంబంధించి ఎస్బీఐ సహా ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు ఎప్పటికి అప్పుడు సెక్యూరిటీ టిప్స్ జారీ చేస్తుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఓటీపీ ఆధారిత ఉపసంహరణ వంటి వాటిని తీసుకు వస్తూ కస్టమర్లకు మరింత భద్రతను కల్పిస్తున్నాయి. బ్యాంకులు సూచించే కొన్ని జాగ్రత్తలు...
మీ ఏటీఎం పిన్ ఎవరికీ చెప్పవద్దు. మీ పిన్ నెంబర్ను ఎవరితోను షేర్ చేసుకోవద్దు. ఫ్రాడ్స్టర్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పిన్ నెంబర్, కార్డు నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియనివారు పంపించే లింక్స్ పైన క్లిక్ చేయవద్దు. మీ స్టేట్మెంట్ను నిత్యం చెక్ చేస్తూ ఉండాలి. మీ కార్డు, బ్యాంకు స్టేట్మెంట్ను మానిటర్ చేసుకోవాలి.