చందాదారులకు ఊరట, NPS నుండి ఆన్లైన్ ద్వారా ఎగ్జిట్ కావొచ్చు
నేషనల్ పెన్షన్ సిస్టం(NPS) నుండి సబ్స్క్రైబర్లు ఇక నుండి ఆన్ లైన్ విధానంలో కూడా నిష్క్రమించవచ్చు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(PFRDA) బుధవారం నాడు ప్రకటించింది. ప్రస్తుతమున్న విధానంలో ఫిజికల్ అప్రోచ్ ద్వారా సాధ్యమయ్యేది. పాయింట్ ఆఫ్ ప్రజెన్స్(POP)ల వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి ఈ స్కీం నుండి నిష్క్రమించవచ్చు. ఇతర డాక్యుమెంట్లతో పాటు NPS ఉపసంహరణ పత్రాలను సమర్పించాలి. ఇప్పుడు దానిని డిజిటల్ మోడ్లోకి తీసుకు వచ్చారు. తద్వారా ఆన్లైన్ ద్వారా కూడా ఎగ్జిట్ కావొచ్చు.
ప్రస్తుత విధానంతో పాటు ఇదీ
ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతితో పాటు ఆన్లైన్లో కూడా NPS నిష్క్రమణ ప్రక్రియను చందాదారులు పూర్తి చేసుకోవచ్చని PFRDA తెలిపింది. OTP/ఈ-సైన్ వినియోగం ద్వారా చందాదారులు తమ ఉపసంహరణ డాక్యుమెంట్లను ఆన్లైన్లో సమర్పించవచ్చునని తెలిపింది. అయితే ఈ ప్రక్రియ కూడా POPలకు అనుసంధానంగానే జరుగుతుందని వెల్లడించింది. నఅయితే ఎక్కడి నుండైనా ఆన్లైన్లో చేసుకోవచ్చని పేర్కొంది.
ఫీజు ఎంతంటే
ఆన్లైన్/ఆఫ్లైన్ ఉపసంహరణ ప్రక్రియకు చందాదారులు కనిష్ఠంగా రూ.125, గరిష్ఠంగా రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుందని PFRDA స్పష్టం చేసింది. అలాగే చందాదారుల కార్పస్ ఫండ్లో POPలకు ప్రోత్సాహక రూపంలో ఫీజుగా 0.125 శాతం అందుతుందని వెల్లడించింది.
ఇదీ ఎన్పీఎస్
NPS పెట్టుబడులకు ఎంతో అనువైనదిగా భావిస్తుండటంతో చాలామంది ఖాతాదారులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. 2004లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. 2009లో ఇందులో అందరికీ పెట్టుబడులు పెట్టే అవకాశమిచ్చారు. 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ పథకంలో ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలు తమ పెన్షన్ నిధుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దాదాపు 7,900 కార్పొరేట్లు NPSలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పథకం ఆధారంగా 9 శాతం నుంచి 12 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పెట్టుబడుల ఆధారంగా పెన్షన్ వస్తుంది. NPSలో పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. NPSలో ఖాతాను తెరిచేందుకు పెద్దగా ధ్రువపత్రాలు అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డుతో ఆన్లైన్ ద్వారా ఈ-ఎన్పీఎస్ వెబ్సైట్ ద్వారా అకౌంట్ తెరువవచ్చు.