SBI ఆన్లైన్ బ్రాంచీ మార్పు: ఇంట్లో కూర్చొని ఇలా మార్చుకోండి
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI తమ కస్టమర్లు ఆన్లైన్ ద్వారా బ్రాంచీని మార్చుకునే వెసులుబాటును కల్పించింది. సేవింగ్స్ ఖాతాదారులు తమ శాఖను మార్చుకోవాలని భావిస్తే ఇక నుండి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్ ద్వారా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో SBI ఈ మేరకు స్పష్టం చేసింది. యోనో SBI, యోనో లైట్, ఆన్లైన్ ఎస్బీఐ వినియోగం ద్వారా ఖాతాను సులభంగా అందుబాటులోని మరో ఎస్బీఐ శాఖకు బదిలీ చేసుకోవచ్చునని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.
వీటి ద్వారా మార్చుకోవచ్చు
కరోనా సమయంలో SBI కస్టమర్లకు ఇది గుడ్న్యూస్ అని చెప్పవచ్చు. తమ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను మార్చుకోవడానికి బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఎస్బీఐకి చెందిన యోనో ఎస్బీఐ, యోనో లైట్ యాప్స్తో పాటు ఆన్లైన్ ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా మార్చుకోవచ్చు. కరోనా సమయంలో బ్యాంకుల వద్ద రద్దీని నియంత్రించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇలా చేయండి
బ్యాంకు శాఖను మార్చుకోవడానికి ముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లు అయి ఉండాలి. ఇది వరకు సదరు బ్రాంచీలో మీ మొబైల్ నెంబర్ వివరాలు అప్ డేట్ అయి ఉండాలి.ముందుగా ఎస్బీఐ ఆన్లైన్లో పర్సనల్ బ్యాంకింగ్ విభాగంలోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి.
ఓటీపీ వచ్చాక..
తర్వాత ఈ-సర్వీస్ విభాగంలోని ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్పైన క్లిక్ చేయాలి. మీరు మార్చుకోవాలని భావిస్తున్న బ్రాంచీ IFSC కోడ్ ఎంటర్ చేయాలి.వివరాలు పూర్తి చేశాక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్ మీరు కోరుకున్న బ్రాంచీకి మారుతుంది.యోనో యాప్, యోనో లైట్లో కూడా ఇదే ప్రక్రియ. ఇందుకు ముందుగా మీ బ్యాంకు ఖాతాను అనుసంధానించాల్సి ఉంటుంది.