వీరికే అర్హత..: రుణ పునర్వ్యవస్థీకరణపై ఆర్బీఐ కీలక ప్రకటన
కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణగ్రహీతలకు ఉపశమనం కల్పించేందుకు తీసుకువచ్చిన రుణ పునర్వ్యవస్థీకరణ స్కీం అందరికీ వర్తించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి ఎలాంటి ఎగవేతలకు పాల్పడని ప్రామాణిక రుణ ఖాతాదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో ఒకసారి రుణ పునర్వ్యవస్థీకరణకు వెసులుబాటు కల్పిస్తూ ఆగస్ట్ 6వ తేదీన ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 2020 మార్చి 1 నాటికి 30 రోజులకు మించి బకాయిలు లేకుండా, ఆ తర్వాత మళ్లీ చెల్లింపులు జరిగి క్రమబద్దీకరణ అయిన స్టాండర్డ్ ఖాతాలకు రుణ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలిపింది.
సాధ్యమైనంత త్వరగా చేయండి: లోన్ మారటోరియంపై కేంద్రానికి సుప్రీంకోర్టు డెడ్లైన్!
వ్యక్తిగత రుణాల కింద తీసుకోకుంటే..
రుణగ్రహీతలు, రుణదాతలకు స్పష్టతను ఇస్తూ రుణ పునర్వ్యవస్థీకరణ కోసం ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. కార్యకలాపాల ప్రారంభం వాయిదా పడిన నిర్మాణ దశలోని ప్రాజెక్టులు తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తించదు. రూ.100 కోట్లకు మించి రుణాలకు క్రెడిట్ ఏజెన్సీ అభిప్రాయం అవసరం. ఎంఎస్ఎంఈలకు 2020 మార్చి 1వ తేదీకి ముందు నిర్వచనం ప్రకారమే పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుంది. స్థిరాస్థి తనఖా రుణాలకు వర్తిస్తుంది. కానీ రుణగ్రహీతలు వాటిని వ్యక్తిగత రుణాల కింద తీసుకొని ఉండరాదు.
వ్యవసాయ రుణాల్లో..
2020 మార్చి 1వ తేదీ నాటికి ఉన్న రుణ బకాయి విలువపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ రుణాలను కూడా పునర్ వ్యవస్థీకరించుకునే వెసులుబాటు ఉంది. పాడి, మత్స్య, పౌల్ట్రీ, పట్టుపురుగుల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ విభాగాలకు మాత్రం వర్తించదు. ఎంఎస్ఎంఈ, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలను పునర్ వ్యవస్థీకరణ చేసుకోవచ్చు. అయితే ఇవి వ్యక్తిగత రుణాల కింద ఇస్తే వర్తించదు. కార్పోరేట్ బాండ్స్, వాణిజ్య పత్రాల వంటి సెక్యూరిటీస్ల రూపంలో పొందిన రుణాలకు అర్హత ఉంది.
ఒకటికి మించి సంస్థలు రుణాలు ఇచ్చి ఉంటే
ఒకే సంస్థకు ఒకటికి మించిన సంస్థలు రుణాలు ఇచ్చినట్లయితే ఆ రుణ పునరుద్ధరణకు అన్ని సంస్థలు సంయుక్తంగా కలిసి ఇంటర్ క్రెడిటార్ ఒప్పందానికి రావాలి. జూన్ 26 నుంచి ఎంఎస్ఎంఈ నిర్వచనం మారినప్పటికీ అదేమీ ఆయా పరిశ్రమల రుణాలపై ప్రభావం చూపించదని ఆర్బీఐ పేర్కొంది. వీటికి సంబంధించిన రుణాల పరిష్కారానికి మార్చి 1 నాటికి అమల్లో నిర్వచనమే ఆధారంగా తీసుకోనున్నట్లు వెల్లడించింది.