Covid-19 pandemic: మీ పీఎఫ్ అకౌంట్ నుండి రెండుసార్లు డబ్బులు ఎలా తీసుకోవచ్చు?
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ సబ్స్క్రైబర్లు పీఎఫ్ అకౌంట్ నుండి రెండింతల మొత్తాన్ని ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఉద్యోగులకు ఉపశమనం కల్పించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎఫ్ సబ్స్క్రైబర్లు డబ్బును ఉపసంహరించుకోవడానికి ఆన్ లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కొన్ని గంటల్లోనే ఖాతాదారుల అకౌంట్లలోకి వస్తుంది.
ఒమిక్రాన్ ఆందోళనలు...
కరోనా వరుస వేవ్స్ నేపథ్యంలో నాన్-రీఫండబుల్ అడ్వాన్స్లను రెండుసార్లు ఉపసంహరించుకోవడానికి వెసులుబాటు కల్పించింది ఈపీఎఫ్ఓ. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈపీఎఫ్ అకౌంట్ నుండి ఉపసంహరించుకునే వారి సంఖ్య కరోనా ముందుస్థాయి కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుండి రెండుసార్లు అడ్వాన్స్ మొత్తాలను సులభంగా ఉపసంహరించుకోవచ్చు. గతంలో ప్రభుత్వం ఒకసారి మాత్రమే తీసుకోవడానికి అనుమతించింది. వైద్య చికిత్స అవసరమైన వారికి ఈ ప్రత్యేక సదుపాయం ఉంది. ఫండ్ కొన్ని గంటల్లో బదలీ చేస్తారు. కోవిడ్ 19 చికిత్స కోసం పీఎఫ్ అడ్వాన్స్ను ఉపసంహరించుకునే కొన్ని దశలు...
ఇలా ఉపసంహరణ...
- ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్లాలి.
- యూఏఎన్ నెంబర్ను, పాస్ వర్డ్ను ఉపయోగించి పీఎఫ్ అకౌంట్లోకి లాగ్-ఇన్ కావాలి.
- ఆన్లైన్ సర్వీస్ కేటగిరీలోకి వెళ్లాలి.
- మీ క్లెయిమ్ను ఎంచుకోవాలి. (Form-31, 19, 10C and 10D).
- మీ పేరు, పుట్టిన తేదీ, మీ ఆధార్ నెంబర్లోని చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేయాలి.
- మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. వెరిఫై పైన క్లిక్ చేయాలి.
- సంబంధిత సర్టిఫికెట్ను జత చేయాలి.
- పీఎఫ్ అడ్వాన్స్ను ఎంచుకోవాలి. ((Form 31).
- Outbreak of pandemic (COVID-19) ఫామ్ను ఎంచుకోవాలి.
- అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
- స్కాన్ చేసిన అడ్రస్ ప్రూఫ్, క్యాన్సిల్డ్ చెక్ కాపీలను అప్ లోడ్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ను ఎంటర్ చేయాలి.
నెలాఖరున పెన్షన్
ఇదిలా ఉండగా, ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు శుభవార్త అందించింది. ఇక నుండి ప్రతి నెల చివరి రోజున ఆ నెలకు సంబంధించి పెన్షన్ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పీఎఫ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులకు విధివిధానాలను జారీ చేయాలని పీఎఫ్ ఆఫీస్లకు సూచనలు అందాయి. అయితే పెన్షన్ చెల్లింపుకు కొన్ని బ్యాంకులతో ఈపీఎఫ్ఓ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో ప్రతి నెల పదో తేదీన నాటికి పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కొన్ని బ్యాంకులు ఏడో తేదీన జమ చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు పదో తేదీ నాటికి జమ చేసేవి. అయితే ఆర్బీఐ నిబంధనల మేరకు ప్రతి నెల 5వ తేదీలోపు పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఈపీఎఫ్ఓ బ్యాంకులకు నాలుగేళ్ల కిందటే సూచించింది. అయినప్పటికీ ఇబ్బందులు ఎదురు కావడంతో తాజాగా ప్రతి నెల చివరి పని దినం రోజున ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని పీఎఫ్ కార్యాలయాలకు సూచించింది.