రెండ్రోజుల్లో రూ.1,800 పెరిగిన బంగారం ధర, 43,000 మార్క్ దాటి..
కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత బంగారం వంటి అతి విలువైన వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో వాటి ధరలు పెరుగుతున్నాయి. బుధవారం ఎంసీఎక్స్లో బంగారం ధరలు 10 గ్రాములకు 0.5 శాతం (రూ.213) పెరిగి రూ.43,687గా ఉంది. అంతకుముందు సెషన్లో రూ.1,544 (3.6 శాతం) పెరిగింది. వెండి ధర 1 శాతం పెరిగి రూ.46,798కి చేరుకుంది. గత సెషన్లో వెండి రూ.1,295 (3 శాతం) పెరిగింది.
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు: ఢిల్లీ, హైదరాబాద్లో ఎంతంటే
ఫెడ్ రేట్లలో కోత... బంగారంపై ప్రభావం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చేందుకు వీలుగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లలో అర శాతం కోత విధించింది. దీంతో ఫెడరల్ ఫండ్స్పై ప్రస్తుత వడ్డీ రేట్ల లక్ష్యిత శ్రేణి 1.0 శాతం నుండి 1.25 శాతానికి చేరుకుంది. గత ఏడాది నుండి ఫెడ్ తొలిసారిగా వడ్డీ రేట్లు తగ్గించింది. విధాన సమావేశాల మధ్యలో కీలక వడ్డీ రేట్లను తగ్గించడం 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ఇదే తొలిసారి. ఫెడ్ రేట్లు తగ్గించడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావం బంగారంపై పడింది.
బంగారం రికార్డ్ ధర
బంగారంపై 12.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ ఉంటుంది. అలాగే డాలరు మారకంతో రూపాయి 73.50కు పడిపోయింది. మంగళవారం 73.29 వద్ద రూపాయి క్లోజ్ అయింది. వీటికి కరోనా తోడయింది. దీంతో బంగారం ధర రూ.43,788 రికార్డ్ ధరకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.3 శాతం పెరిగి 1,643.76 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా ఔన్స్కు 0.2 శాతం పెరిగి 17.21 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం ధర 0.9 శాతం పెరిగి 882.50 డాలర్లకు చేరుకుంది.
రెండు రోజుల్లో 1,800 పెరుగుదల
ఫెడ్ రేట్ కట్, కరోనా వైరస్, దేశీయ జ్యువెల్లర్స్, రిటైలర్ల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర పెరుగుతోంది. రూపాయి పతనం కూడా పెరుగుదలకు కారణం. బంగారం ధర రెండు రోజుల్లో రూ.1,800 వరకు పెరిగింది.
హైదరాబాద్లో ఎంత ఉందంటే?
బుధవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర రూ.160 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.39,980 నుండి రూ.40,140కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం స్వల్పంగా పెరిగి రూ.43,790గా ఉంది.