పారాహుషార్ : కొత్త ఏడాదిలో బీమా ప్రీమియం పెరిగే ఛాన్స్... ఎందుకంటే?
ఇప్పటికే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయలు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. వచ్చే డిసెంబర్ నుంచి టెలికాం చార్జీలు కూడా పెరుగుతాయట. చార్జీలు పెరిగాయి కదా అని మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించలేము కదా. ఇప్పటికే ఫోన్ కు బానిసయిపోయాము మరి. కాబట్టి కొత్త చార్జీలతో జేబుకు మరింత చిల్లు పడనుంది. ఇక బీమా విషయానికి వస్తే కొత్త సంవత్సరంలో సాధారణ బీమా ప్రీమియం మరింత పెరగ వచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎంత లేదన్న బీమా ప్రీమియం 10-15 శాతం పెరగవచ్చంటున్నారు.
ఊహించినట్టుగానే బీమా ప్రీమియం పెరిగితే కొత్త సంవత్సరంలో బడ్జెట్ పై మరింత భారం పడే అవకాశం ఉందన్న మాట. ప్రీమియం పెరిగితే పాలసీని రెన్యూవల్ చేయకుండా ఉండలేము కదా. కాబట్టి ఆ భారాన్ని భరించాల్సిందే.
కారణం ఏమిటంటే?
* రీఇన్సూరెన్స్ రేట్లలో పెరుగుదలే బీమా ప్రీమియం రేట్లు పెరగడానికి దారి తీయవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బీమా కంపెనీలు మనం తీసుకునే ఇన్సూరెన్సు కు రీఇన్సూరెన్స్ చేస్తుంటాయి. ఈ రేట్లు పెరిగితే ఆ భారాన్ని బీమా కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేస్తాయి. జనవరి ఒకటో తేదీ రీఇన్సూరెన్సు కాంట్రాక్టులు రెన్యువల్ కాబోతున్నాయి. అప్పుడు గాని రేట్లు పెంచితే బీమా ప్రీమియం రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది.
బీమా వ్యాపారంలో రిస్క్ ఉంటుంది కాబట్టి అన్ని సాధారణ బీమా పాలసీలకు రీఇన్సూరెన్సు చేస్తాయి బీమా కంపెనీలు. బీమా క్లెయిమ్ లు పెరిగినప్పుడు ఆ భారం తమ కంపెనీ మీద పడకుండా ఉండేందుకు గాను బీమా కంపెనీలు రీఇన్సూరెన్సు తీసుకుంటాయి. క్లెయిమ్స్ పెరిగితే రీఇన్సురెన్సు రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుందంటున్నారు.
మన వారు విదేశీ వెబ్ సైట్లను వదలడం లేదు... దేనికో తెలుసా?
ఏ ప్రీమియం లు పెరగవచ్చంటే..
* దేశీయ, అంతర్జాతీయ కారణాల వల్ల బీమా ధరలు పెరగడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. రీఇన్సురెన్సు కంపెనీలు దేశీయంగానే కాకుండా ఇతర దేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. ఈ కంపెనీలు అధిక క్లెయిమ్ లను చెల్లించాల్సి వస్తే ఆమేరకు ప్రీమియం రేట్లను పెంచడానికి సిద్ధమవుతాయి. ప్రస్తుత ఏడాది క్లెయిమ్ లను బట్టి వచ్చే ఏడాదిలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో అంచనా వేస్తుంటాయి.
* కాగా వచ్చే ఏడాదిలో లయబిలిటీ ఇన్సూరెన్సు, ఫైర్ ఇన్సూరెన్సు, మోటార్ ఇన్సూరెన్సు, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్సు రేట్లు 10-15 శాతం వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.
* వాహనాలకు సంభందించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు ప్రీమియం పెరగడానికి అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల సమగ్ర మోటార్ పాలసీల ధరలు కూడా పెరగవచ్చంటున్నారు.
* ఈ ధరలకు తోడు బీమా ప్రీమియంపై అధిక వస్తుసేవల పన్ను ఉండటం కూడా కస్టమర్లకు ఇబ్బందికరంగా మారుతోంది.
* బీమా కంపెనీలకు వచ్చే క్లెయిమ్స్ ఎక్కువగా ఉంటే కూడా ప్రీమియంలు పెంచడానికి అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా ప్రకృతి విపత్తులు జరిగి ఎక్కువ మొత్తంలో బీమా క్లెయిమ్స్ చెల్లించ వలసి వస్తే కంపెనీలు మరుసటి సంవత్సరంలో ప్రీమియం లను సవరించడానికి అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.