నేటి నుండి కొత్త మార్జిన్ విధానం, ఖాతాల్లో డబ్బు లేకుంటే భారీ ఛార్జీ: సంస్థల ఆందోళన
స్టాక్ మార్కెట్లో నగదు విభాగంలో ఈ రోజు (సెప్టెంబర్ 1) నుండి కొత్త మార్జిన్ల విధానం అమల్లోకి వచ్చింది. నిన్న(ఆగస్ట్ 31) బ్రోకర్లు, డిపాజిటర్లు, క్లియరింగ్ కార్పోరేషన్లతో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఈ మేరకు నిర్ణయించింది. నేటి నుండి కొత్త మార్జిన్ నిబంధనలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారులకు మరింత విశ్వాసం కల్పిస్తూ, వారి పెట్టుబడులకు రక్షణ కల్పించేలా సెబి ఈ నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్లో మరింత పార్దర్శకతను కోరుకుంటోంది.
కుప్పకూలిన మార్కెట్లు, సెన్సెక్స్ 840 పాయింట్లు క్రాష్: చైనా బార్డర్ టెన్షన్స్ సహా కారణాలివే..
స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు గడువు కోరాయి కానీ...
నిన్న జరిగిన సమావేశంలో స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని కోరాయి. అయినప్పటికీ సెబి మాత్రం సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ కొత్త విధానం అమలుకు మొగ్గు చూపింది. ఇప్పటికిప్పుడు ఈ చర్య వల్ల బ్రోకర్లు, ఇన్వెస్టర్లు సిద్ధం కావడానికి సమయం తీసుకుంటుందని, అందుకే ట్రేడింగ్ వ్యాల్యూమ్స్ తగ్గుతాయని బ్రోకింగ్ సంస్థలు చెబుతున్నాయి. డిపాజిటరీ సంస్థలైన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(CDSL), రెగ్యులేటర్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(NSDL) నాలుగు రోజుల క్రితమే సాఫ్టువేర్లో మార్పులు చేసినందున అధ్యయనం చేసేందుకు తమకు తగినంత సమయం దొరకలేదని చెబుతున్నారు.
కొత్త విధానంలో కొంత కాలం పాటు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్చేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా(ANMI) రెగ్యులేటర్ను నెల గడువు కోరింది. నేటి వర్చువల్ సమావేశంలో సమయం ఇచ్చేందుకు సెబి నిరాకరించిందని, ANMIకి చెందిన 900 మంది సభ్యులు ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారని, దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు ANMIఅధికార ప్రతినిధి తెలిపారు.
ఖాతాదారుల సెక్యూరిటీలు దుర్వినియోగం కాకుండా..
CDSL, NSDLను సెబీ అడగ్గా.. తాము కొత్త మార్జిన్ విధానానికి సిద్ధమని తెలిపాయి. దీంతో ఈ రోజు నుండి అమలుకు నిర్ణయించారు. కొత్త మార్జిన్ విధానం ద్వారా మరింత పారదర్శకత ఉంటుందని, ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేయకుండా బ్రోకరేజీలను నిరోధిస్తుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్పులు ఇవే...
- ఇన్వెస్టర్ల ఖాతాతోలో తగినంత సొమ్ము లేకుండా (మార్జిన్ మనీ షార్ట్ ఫాల్) క్రయవిక్రయాలు నిర్వహిస్తే అందుకు భారీ పెనాల్టీ చెల్లించాలి.
- షేర్లు కొనేందుకు అయినా, విక్రయించేందుకు అయినా ఇన్వెస్టర్ల ఖాతాల్లో నిర్దేశించిన సొమ్ము జమ అయి ఉండాలి. షేర్లు విక్రయించి, అదే రోజు తమ డీమ్యాట్ అకౌంట్ నుండి షేర్లు బదలీ చేస్తే మార్జిన్ మనీ అవసరం లేదు.
- బై టుడే, సెల్ టుమారో పద్ధతి కుదరదు.
- ఓ కంపెనీ షేర్ కొనుగోలు చేసిన తర్వాత టీ ప్లస్ టూ పద్ధతిలో ఆ షేర్లు ఇన్వెస్టర్ల డీపీ ఖాతాలకు జమ అయిన తర్వాతే వాటిని విక్రయించడం కుదురుతుంది.
- ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లను మార్జిన్ కింద పెట్టి దానిపై షేర్ల కొనుగోలుకు లిమిట్ తీసుకోవచ్చు. గతంలో అయితే ఈ షేర్లను బ్రోకర్ల పూల్ అకౌంట్కు మార్చవలసి వచ్చేది. ఇప్పుడు ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలోే ఆ ,ేర్లు తనఖా పెట్టినట్లుగా నమోదవుతుంది.