కస్టమర్లకు అలర్ట్: బ్యాంకుల్లో కొత్త పనివేళలు, రోజుకు 4 గంటలే
కరోనా మహమ్మారి ఉధృతమవుతోన్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్నటి నుండి (బుధవారం మే 12) తెలంగాణలోను పది రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం ఆరు గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలి. మిగతా సమయంలో ఇంట్లోనే ఉండిపోవాలి. బ్యాంకులు కూడా లాక్ డౌన్ నేపథ్యంలో కొత్త పని వేళలు అమల్లోకి తీసుకు వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్న్యూస్: ఈ సేవల కోసం మిస్డ్ కాల్ నెంబర్స్ ఇవే...
బ్యాంకు పనివేళల్లో మార్పులు
బ్యాంకులు పనివేళల్లో మార్పు చేసాయి. మే 13 గురువారం నుండి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తాయి. అత్యవసర సేవల్లో భాగంగా బ్యాంకులు, ఏటీఎంలను లాక్డౌన్ నుండి మినహాయిస్తున్నట్లు, అవి యధావిధిగా పని చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పనివేళలను ఉదయానికి మాత్రమే పరిమితం చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి.
అందుకే మార్పులు
ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) సూచనల మేరకు తాజా బ్యాంకు పనివేళల్లోనే నగదు డిపాజిట్, ఉపసంహరణ, చెక్ క్లియరెన్స్, రెమిటెన్స్, ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనున్నట్లు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ(SLBC) తెలిపింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు బయటకు వస్తారు. కాబట్టి బ్యాంకులు రోజంతా తెరిచి ఉన్నప్పటికీ ఉపయోగం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారు.
కఠిన ఆంక్షలు
బ్రాంచీలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లలో ఉద్యోగులు రొటేషనల్ పద్ధతిలో వర్క్ చేయనున్నారు. కాగా, బ్యాంకు పనివేళల తగ్గింపును తెలంగాణ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) కన్వీనర్ శ్రీరామ్ స్వాగతించారు. కరోనా నేపథ్యంలో దేశంలో రోజుకు లక్షల కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల లాక్ డౌన్, కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.