జనవరి 1 నుంచి రేషన్ కార్డుకు నో: ఏపీలో ఇక బియ్యం కార్డు, లిస్ట్లో మీ పేరు లేకుంటే ఆగాల్సిందే!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖపై దృష్టి సారించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏపీలో రేషన్ రూల్స్ మార్చుతున్నారు. ఏపీలో ఆహార భద్రత నియమాల్లో సవరణలు చేయాలని భావించిన ప్రభుత్వం రేషన్ కార్డుకు ఎవరు అర్హులు అనే విధానంపై సవరణలు చేసింది. రేషన్ కార్డు జారీకి గతంలో ఉన్న అర్హతల్లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ ఇచ్చింది.
తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..
కారు ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు
ఈ కొత్త నిబంధనల మేరకు ఫోర్ వీలర్ ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు బీపీఎల్ కోటా కింద రేషన్ కార్డు ఇస్తారు. తాజా సవరణలలో గ్రామాలు, పట్టణాలలో వార్షిక ఆదాయంతో పాటు ఇతర నిబంధనల్లోను మార్పులు చేసింది. గ్రామాల్లో వార్షికాదాయం రూ.1.20 లక్షల లోపు, పట్టణాల్లో వార్షికాదాయం రూ.144 లక్షల లోపు ఉంటే మాత్రమే రేషన్ కార్డుకు అర్హులు.
బియ్యం కార్డు ఉండాలి..
మరోవైపు, ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులు జనవరి 1, 2020 నుంచి రేషన్ దుకాణాల్లో చెల్లుబాటు కావు. ప్రభుత్వం కొత్తగా ఇచ్చే బియ్యం కార్డు ఉంటేనే నిత్యావసరాలు ఇస్తారు. అది తీసుకోకుంటే మళ్లీ కొత్త బియ్యం కార్డు వచ్చేదాకా అంటే జనవరి వరకు ఆగాలి. వివిధ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గతన నెల 20వ తేదీ నుంచి వైయస్సార్ నవశకాన్ని ప్రారంభించింది. 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉండగా సగానికి పైగా సర్వే పూర్తయింది.
కొత్త కార్డులు
పంచాయతీలు, వార్డుల వారీగా వాలంటీర్ల ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి బియ్యం, ఆరోగ్యశ్రీ, పింఛన్ తదితర పథకాలకు వేర్వేరుగా కార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా నిత్యావసరాలు తీసుకునే వారికి ఇప్పుడు ఉన్న రేషన్ కార్డు స్థానంలో బియ్యం కార్డు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. రేషన్ కార్డులు ఉన్న వారందరికీ మళ్లీ కొత్త కార్డులు అందనున్నాయి.
అర్హుల జాబితా ప్రదర్శన
సంక్షేమ పథకాలకు అర్హులైన వారి జాబితాను ఈ నెల 9వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అందులో పేరు లేకుంటే మూడు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. దానిని పరిశీలించి అర్హులను నమోదు చేసి, తుది జాబితా ఇస్తారు. వీరికి నెలాఖరు నాటికి కొత్త బియ్యం కార్డులు వస్తాయి. రేషన్ షాపుల్లోని దుకాణాల డీలర్లకు ఇచ్చే జాబితాల్లో కూడా ఇవే పేర్లు ఉంటాయి.
ఇంట్లో లేకుంటే...
వైయస్సార్ నవశకం పేరుతో నిర్వహిస్తున్న సర్వే సమయంలో ఇంటివద్ద ఎవరైనా లేకుంటే బియ్యం కార్డులు రాకపోవచ్చు. కాబట్టి కొత్త కార్డుల కోసం జనవరి మొదటి వారం వరకు ఆగాలి. జనవరి 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు బియ్యం కార్డు అవసరమైన వారు అక్కడే దరఖాస్తు చేసుకుంటే అర్హులకు 5 రోజుల్లోగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు.