రూ.2 లక్షల ఫారెన్ ట్రిప్, రూ.1 లక్ష కరెంట్ బిల్లుకు ITR ఫైల్ చేయాల్సిందే
న్యూఢిల్లీ: అధిక వ్యయం చేసేవారు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఆదాయ పన్ను పరిమితి మినహాయింపు రూ.5 లక్షలుగా ఉన్నప్పటికీ, అధిక ఖర్చులు చేస్తే మాత్రం ఆ లోపు అయినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సాధారణంగా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఏయే సందర్భాల్లో రిటర్న్స్ ఫైల్ చేయాలంటే...
ఎప్పుడెప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే?
ఫారన్ ట్రిప్స్కు వెళ్లినప్పుడు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక ఏడాదిలో రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన సందర్భంలో రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఏడాదిలో కరెంట్ బిల్లు రూ.1 లక్ష అంతకంటే ఎక్కువ చెల్లించిన సందర్భాల్లో ఐటీఆర్ ఫైల్ చేయాలి.
2020 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
ఇల్లు వంటి వాటిపై పెట్టుబడి పెట్టినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసినప్పుడు పైల్ చేయాలి. లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసే వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఆదాయాన్ని ఇళ్లు, బాండ్లు, తదితర వాటిల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ కింద ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 54లోని వివిధ నిబంధనల కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. లాంగ్ టర్మ్లో వీటిపై వచ్చిన ఆదాయాన్ని మరో రూపంలో పెట్టుబడి పెడితే అప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. రోల్ ఓవర్ బెనిఫిట్ కింద దీనిని చూపించాలి. ఇందుకు ఆదాయపు పన్ను చట్టంలోని 139వ సెక్షన్ను ప్రభుత్వం సవరించనుంది. ఇవన్నీ రానున్న ఆర్థిక సంవత్సరం (2020) నుంచి వర్తిస్తాయి.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి
ప్రస్తుతం ఎవరైనా ఆదాయ పన్ను మినహాయింపు దాటితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. కొన్ని ఎగ్జెంప్షన్స్ కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఎంతోకొంత ఎక్కువ ఉన్నా వెసులుబాటు ఉంది. ఇప్పుడు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా రూ.1 కోటికి పైగా కో ఆపరేటివ్ సహా ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా లేదా తన సొంతానికి లేదా ఇతరులకు గాని విదేశీ పర్యటనకు రూ.2 లక్షలు ఖర్చు చేసినా లేదా విద్యుత్ బిల్లు రూ.1 లక్ష దాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని పేర్కొంటున్నారు.
లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్
ఎవరైనా ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 కింద లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. కేంద్రం చేసే సవరణలు 1, ఏప్రిల్ 2020 నుంచి అమలులోకి వస్తాయి. ఇప్పటి వరకు ఇల్లు, బాండ్స్ వంటి కొన్ని అసెట్స్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ పైన క్లెయిమ్ చేసుకోవడానికి ఐటీ రిటర్న్స్ చేయవలసిన అవసరం లేదు. ఇక నుంచి ట్యాక్స్ పరిమితికి లోబడి ఉన్నప్పటికీ ఇలాంటి సందర్భాల్లో రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.