పట్టణ కార్మికులకు గుడ్న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే అద్దె ఇళ్లు
న్యూఢిల్లీ: రెండోసారి అద్భుత మెజార్టీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశాన్ని అన్ని రంగాల్లోను పరుగులు పెట్టించే నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, సామాన్యులపై కూడా దృష్టి సారిస్తోంది. అందులో భాగంగానే అసంఘటిత కార్మికులకు పెన్షన్, ఆరోగ్యం కోసం మోడీ కేర్, రైతుల కోసం కిసాన్ సమ్మాన్... ఇలా ఎన్నో పథకాలు తీసుకు వచ్చింది... తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలు, వలస వచ్చిన కార్మికుల అభ్యున్నతిపై దృష్టి సారిస్తోంది.
ఏపీలో స్కూల్కు పంపిస్తే రూ.15,000! ఏ పథకం.. ఎంత లబ్ధి!!
సింగిల్ రూమ్ ప్లాట్ల నిర్మాణం
నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా సరికొత్త హౌసింగ్ ప్లాన్తో ముందుకు రానుందని తెలుస్తోంది. సొంతూళ్లలో ఇంటిని వదిలేసి, మెట్రో నగరాల్లో అద్దెకు ఉంటున్న వలస కార్మికులు లేదా పేదవారి కోసం సింగిల్ రూంలు నిర్మించి, తక్కువ ధరకు అద్దెకు ఇచ్చే ప్లాన్లో ఉందని తెలుస్తోంది. మెట్రో నగరాల్లో మురికివాడలు పెరుగుతున్నాయి. వీటిని తగ్గించడంతో పాటు కార్మికులకు అందుబాటులో సింగిల్ రూమ్ ప్లాట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
ఏడాదికి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉండాలి
ఏడాదికి రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి వీటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందుకోసం ఎత్తైన అపార్టుమెంట్లను (సింగిల్ ప్లాట్ అపార్టుమెంట్) నిర్మించడంతో పాటు అందులో నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఒక్కో ప్లాట్కు ఒక మరుగుదొడ్డి (అటాచ్డ్ టాయిలెట్) వంటి సౌకర్యాలను నిర్మించనున్నారు. ప్రభుత్వం ఇలా నిర్మించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలు తగ్గడంతో పాటు పేదవారికి ప్రయోజనంగా ఉంటుంది.
ప్రధానమంత్రి ఆవాస యోజన కింద
సింగిల్ రూమ్ ప్లాట్ల నిర్మాణాన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కలిసి పని చేయనున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఇందుకు అయ్యే వ్యయం కోసం ఆర్థిక సాయం చేయాలని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ (కేంద్ర కార్మిక శాఖ)ను హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ (కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ)ను కోరనుందని తెలుస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వీటిని నిర్మించనున్నాయి.
ప్రయివేటు మోడల్ అయినా...
ప్రభుత్వ సంస్థలే నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో పాటు మరో మోడల్ కూడా యోచిస్తోంది. ప్రయివేటు సెక్టార్ కంపెనీల ద్వారా నిర్మాణం చేపడితే కొంత ప్రాంతాన్ని కమర్షియల్ పర్పస్ కోసం వినియోగించేలా నిర్మించనున్నారు. అయితే ఇక్కడ ప్రయివేటు సంస్థలు నిర్మించినప్పటికీ అద్దెకు ఇచ్చేది మాత్రం ఆయా రాష్ట్రాల హౌసింగ్ బోర్డులే. ఈ ప్లాట్ల నిర్మాణాన్ని స్థానిక సంస్థల సహకారంతో లబ్ధిదారులను గుర్తించనుంది. రెంట్ వోచర్ విధానం ద్వారా ఈ పథకం ప్రయోజనాన్ని అందించనున్నారు. అర్హులైన వారిని రిజిస్టర్ చేసుకుంటారు. అలాగే, సింగిల్ ప్లాట్ అపార్టుమెంట్ల నిర్మాణ బాధ్యతలను ఆయా రాష్ట్రాల హౌసింగ్ బోర్డులకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఈ స్కీం ఉద్దేశ్యం.. సింగిల్ రూమ్ ప్లాట్లు నిర్మించడం, స్లమ్ ఏరియాల్లో ఉండే పేదలకు అద్దెకు ఇవ్వడం. తద్వారా అనేక ప్రయోజనాలు కలుగజేసేలా ఉండటం. నగరాల్లో ఇల్లు కొనలేని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.