జగన్ స్కీం, 2లక్షలమంది గ్రామ వాలంటీర్లు: అర్హతలు, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామవాలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, అన్ని రకాల ప్రభుత్వ సేవలను అక్కడి నుంచి అందించనున్నారు. ఏపీలోని 13వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో 50 ఏళ్లకు ఒకరు, పురపాలికల్లో వార్డుకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకంపై కసరత్తు పూర్తయింది.
2 లక్షల మంది వాలంటీర్లు
గ్రామాల్లో ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా, మండలాల వారీగా కుటుంబ వివరాలు సేకరించి ఎంతమంది వాలంటీర్లు అవసరమవుతారో అంచనాకు వచ్చారు. పట్టణ ప్రాంతాల్లోను దాదాపు 60వేల మంది వాలంటీర్లు అవసరమవుతారని గుర్తించరట. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వాలంటీర్లు కీలకం కానున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి వాలంటీర్ల వ్యవస్థ అమలులోకి రానుంది.
త్వరలో జీవో జారీ
గ్రామ వాలంటీర్ల కోసం దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఎంపికలో రిజర్వేషన్లకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో జీవో జారీ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ నుంచి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాయి. వీటిని పరిశీలించిన అనంతరం జీవో విడుదల చేస్తారు. వాలంటీర్ల నియామకం కోసం ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. గ్రామ వాలంటీర్ల ఎంపిక, వ్యవస్థ అమలుకు సన్నద్ధంకావాలని ఉన్నతాధికారులు.. అధికారులకు సూచనలు చేశారు.
అర్హతలు
వాలంటీర్ల దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక కోసం కమిటీల ఏర్పాటుపై మార్గదర్శకాలు రూపొందించారు. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్... ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా ఓటరు ఐడీ. అలాగే నివాస ధృవీకరణ పత్రం ఇవ్వాలి. గ్రామ వాలంటీర్ ఉద్యోగం కోసం విద్యార్హత ఇంటర్, పట్టణ వాలంటీర్ల కోసం విద్యార్హత డిగ్రీ, గిరిజన ప్రాంతాల్లోని వారికి విద్యార్హత పదవ తరగతి. వేతనం. రూ.5,000. మండల స్థాయి ఎంపిక కమిటీ ద్వారా నియామకాలు ఉంటాయి. కమిటీలో ఎంపీడీవో, తహసీల్దారు, ఈవోపీఆర్డీ ఉంటారు. దరఖాస్తు చేసుకున్న వారి ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూ చేస్తారు. వాలంటీర్లు లంచాలు తీసుకున్నట్లు తేలితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
వాలంటీర్లు ఏం చేస్తారు?
ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారు. వీరు ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికి చేర్చుతారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులు రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకు వచ్చుకునేవారు. ఇక నుండి గ్రామవాలంటీర్లు వాటిని లబ్ధిదారులకు చేరవేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం, నిత్యావసర వస్తువులు చేరవేస్తారు.
జగన్ ఆదేశాలు
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డోర్ డెలివరీ చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ పౌరసరఫరాల శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నాణ్యమైన సన్న బియ్యాన్ని సేకరించి, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేయించి, సిద్ధం చేసుకోవాలన్నారు. వాలంటీర్ల నియామకం కూడా పారదర్శకంగా ఉండాలన్నారు.