బంగారం ధరలు ఎలా ఉండవచ్చు, 2020లో మళ్లీ ఆ స్థాయిలో ముగుస్తాయా?
బంగారం ధరలు రికవరీ మోడ్లో ఉన్నాయి. 2020 క్యాలెండర్ ఇయర్ ముగింపు దశకు వచ్చినందున.. ఏడాది ముగిసేసరికి మళ్లీ ధరలు నవంబర్ నాటి కనిష్టానికి చేరుకుంటాయా, లేక పైపైకి చేరుకుంటాయా? అనేది అస్పష్టంగా కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. నవంబర్ చివరలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఔన్స్ 1800 డాలర్ల దిగువకు చేరుకోగా, ఇప్పుడు 1850 డాలర్లను తాకింది. కామెక్స్లో పసిడి 1900 డాలర్ల దిశగా కూడా పయనించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 1925 డాలర్ల వద్ద ప్రధాన నిరోధకత స్థాయిని దాటితే, 1975 డాలర్ల దిశగా వెళ్లవచ్చునని చెబుతున్నారు.
ఇవి ప్రభావం చూపుతాయి
బంగారం ధరలు మళ్లీ 1900 డాలర్లు దాటి, 2000 డాలర్ల దిశగా అడుగులు పడవచ్చునని, అయితే పలు అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. కరోనా మహమ్మారి కేసులు, రికవరీలు, అమెరికా ఆర్థిక ప్యాకేజీ, కరోనా కేసుల వల్ల ఈక్విటీ మార్కెట్ ప్రభావం, వచ్చే వారం జరగనున్న ఫెడ మార్కెట్ సమావేశం వంటి అంశాలు బంగారం తగ్గుదల, పెరుగుదలపై ప్రభావం చూపించుతాయని అంటున్నారు.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో...
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఈ వారం పసిడి 49,730 వద్ద గట్టి నిరోధం ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయిని దాటితే రూ.50,000 క్రాస్ చేసి, 50,750 దిశగా వెళ్లవచ్చునని చెబుతున్నారు. రూ.49,080 దిగువకు వస్తే మాత్రం 48,800 దిగువకు కూడా రావొచ్చునని చెబుతున్నారు. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చునని గోల్డ్ కాంట్రాక్టుకు సానుకూలత కొనసాగుతుందని అంటున్నారు.
సిల్వర్ ఫ్యూచర్స్ సానుకూలం
సిల్వర్ ఫ్యూచర్ కూడా ఈ వారం సానుకూలంగా కనిపిస్తోంది. రూ.62,000 దిగువకు రాకుంటే మరింత పెరగవచ్చునని చెబుతున్నారు. ఇక ఈక్విటీ మార్కెట్లు అప్ ట్రెండ్ ఈ వారం కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత శుక్రవారం నమోదైన గరిష్టస్థాయి 13,600 కంటే పైన నిలదొక్కుకుంటే అప్ ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. నిఫ్టీ 13,350 నుండి 13,600 మధ్య కదలాడవచ్చునని అంచనా.