మిల్లీనియల్స్కు మనీ, ఫైనాన్షియల్, ఇన్వెస్ట్మెంట్ టిప్స్
ఆర్థిక అవగాహనలేమి, ఆర్థిక ఆరోగ్యంపై తగినంత దృష్టి లేకపోవడంతో మిల్లీనియల్స్ తమ ఆర్థిక నిర్ణయాలను తరుచూ వాయిదా వేయడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో చాలామందికి ఆర్థిక దృక్పథం ఏర్పడింది. భవిష్యత్తు కోసం దాచుకోవడం, ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సురెన్స్ కొనుగోలు వంటివి పెరిగాయి. అనుకోని ఉపద్రవాలు ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్, హెల్త్ ఇన్సురెన్స్ కొనుగోళ్లు, పెట్టుబడులు ముందు నుండి పెట్టడం వంటివి భవిష్యత్తుకు ఎంతో అవసరం.
మిల్లీనియల్స్ ఏం చేయాలంటే
మిల్లీనియల్స్ మొదట చేయాల్సింది తగినంత ఎమర్జెన్సీ ఫండ్ను నిర్వహించడం. వేతనజీవులు లేదా వ్యాపారులు, ఇతర రంగాలలోని వారు తమ నెలసరి యుటిలిటీ బిల్స్, రోజువారీ ఖర్చులు, ఈఎంఐలు, సిప్స్, అద్దె, బీమా ప్రీమియం చెల్లింపు వంటి వాటి కోసం ప్లాన్తో ముందుకు వెళ్తారు. అయితే ప్రతి నెల వీటికి ఎంత మొత్తం ఖర్చు అవుతుందో దాదాపు అంతకు ఆరు రెట్ల వరకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. కీలకమ ఆర్థిక లక్ష్యాల కోసం కేటాయించిన పెట్టుబడులను రద్దు చేయకుండా లేదా ఎక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందకుండా తగినంత అత్యవసర నిధిని కలిగి ఉండటం ఆర్థిక అవసరాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అత్యవసర నిధిని అధిక దిగుబడి వచ్చే పెట్టుబడుల సాధనాలలో ఉండేలా చూసుకోవాలి.
టర్మ్, హెల్త్ ఇన్సురెన్స్ కొనుగోలు
జీవిత బీమా పాలసీ కొనుగోలు చేయాలి. అకాల మరణం సంభవిస్తే ఆధారపడిన వారికి డబ్బు ద్వారా కొండంత అండ దొరుకుతుంది. మీ జీవిత బీమా కవర్ మీ వార్షిక ఆదాయంతో పోలిస్తే కనీసం పదిహేను రెట్లు ఉండేలా చూసుకోవాలి. టర్మ్ ఇన్సురెన్స్, పాలసీలు కొనుగోలు చేయడంపై దృష్టి సారించాలి. ఆరోగ్య బీమా పాలసీలు కూడా తీసుకోవాలి. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుకు ఇది ఉపయోగపడుతుంది.
పెట్టుబడులు
మిల్లీనియల్స్ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం సంపాదన ప్రారంభించిన మొదటి నుండే పెట్టుబడులు పెట్టడం అలవర్చుకోవాలి. సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడులపై దృష్టి సారించాలి.