5 రోజుల్లోనే అదరగొట్టిన ఈ బ్యాంకింగ్ స్టాక్: టెక్, ఈ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అదుర్స్
రష్యా - ఉక్రెయిన్ అనిశ్చితి కాస్త తగ్గినట్లుగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు గత మూడు రోజులుగా లాభాల్లో ఉన్నాయి. దీనికి తోడు కనిష్టాల వద్ద పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గు చూపారు ఇన్వెస్టర్లు. దీంతో మూడు రోజుల పాటు మార్కెట్లు పరుగులు తీశాయి. అయితే నేడు సూచీలు నష్టాల్లో ప్రారంభమై, ఆ తర్వాత ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 56,000 పాయింట్లకు దిగువనే ఉంది. సెన్సెక్స్ 55,218 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, 55,833 పాయింట్ల వద్ద భారీ లాభాలతో గరిష్టాన్ని తాకింది. ఓ సమయంలో 55,049 పాయింట్లకు పడిపోయి నిన్నటి ముగింపు నుండి 400 పాయింట్లకు పైగా పతనమైంది. అయితే ఉదయం గం.11.30 సమయానికి సూచీలు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు ఎగిసి 55,558 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 16,618 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
పెట్టుబడి భయాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్భణ ఆందోళనలు వంటి వివిధ అంశాల ప్రభావంతో మార్కెట్లు అంతకుముందు భారీగా నష్టపోయాయి. ఇటీవల సానుకూల సంకేతాలతో లాభాల్లో ఉన్నాయి. మొత్తానికి సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి చాలా దూరంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోను పలు స్టాక్స్ మంచి లాభాలను అందించాయి. కొన్ని స్టాక్స్ గత కద్ది సెషన్లలోనే అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చాయి.
ఈ బ్యాంక్ స్టాక్ అదుర్స్
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (SFB) స్టాక్ గత ఐదు సెషన్లలో ఏకంగా 9 శాతం లాభపడింది. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కూడా ఈ బ్యాంక్ స్టాక్ మున్ముందు మరింత పెరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.1174.50 వద్ద ఉంది. 30 శాతానికి పైగా పెరిగి రూ.1550 చేరుకోవచ్చునని టార్గెట్ ధరను అంచనా వేస్తోంది. ఈ స్టాక్ నేడు కూడా 1 శాతానికి పైగా లాభపడింది.
ఈ స్టాక్స్ కూడా...
మరో బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పలు స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ టార్గెట్ ధరను పెంచింది. ఆర్-22 ధర ప్రస్తుతం రూ.244 పెరిగిందని గుర్తు చేసింది. కానీ వ్యాల్యూమ్ ఏడాది ప్రాతిపదికన 81 శాతం తగ్గిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని స్టాక్స్పై ఆశాజనకంగా ఉంది.
కరోనా సమయంలోను భారత టెక్ దిగ్గజాలు మంచి బిజినెస్ చేశాయి. దీంతో ఆ స్టాక్స్ కూడా మిగతా రంగాల కంటే మంచి ప్రతిభ కనబరిచాయి. ఇదే రంగంలోని డిజిటల్ మ్యాప్స్ ప్రొవైడర్ సీఈ ఇన్ఫో సిస్టమ్స్ లేదా మైప్యాప్ ఇండియా స్టాక్స్ ఆకట్టుకుంటున్నాయి. గురువారం ఈ స్టాక్ 2 శాతానికి పైగా లాభపడి రూ.1505 సమీపంలో ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 7 శాతం ఎగిసిపడింది. ఈ స్టాక్ ఈ రోజు దాదాపు ఒక శాతం లాభపడి రూ.1518 వద్ద ట్రేడ్ అయింది.