ఏడాదిలో అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన 3 ఫండ్స్: ఒకేసారి ఇన్వెస్ట్ చేయవచ్చా?
గత ఏడాది కాలంగా మార్కెట్లు క్రమంగా బలపడ్డాయి. కరోనా కారణంగా 2020 మార్చి చివరి వారంలో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఆర్థిక రికవరీ కనిపించడంతో సూచీలు 53,000 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ 47,000 దిగువకు పడిపోయినప్పటికీ తిరిగి పుంజుకుంది. సెన్సెక్స్ మళ్లీ 53000 పాయింట్లను తాకింది. అయితే డెల్టా వేరియంట్, లాక్ డౌన్ ఆంక్షల భయంతో ప్రపంచం వణికిపోతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం ఈ వారం భారత మార్కెట్లపై కనిపించింది. దీంతో రికార్డ్ గరిష్టం నుండి కిందకు వచ్చాయి. అయితే సూచీలు సరికొత్త గరిష్టాలను తాకుతుండటంతో వివిధ ఫండ్స్ మంచి రాబడిని అందిస్తున్నాయి. గత ఏడాది కాలంలో లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అసాధారణ రాబడిని అందించాయి.
మూడు లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇవే
ఇక్కడ అధిక రాబడి ఇచ్చిన లార్జ్ క్యాప్ ఫండ్స్ అని చెబుతున్నామంటే.. గత ఏడాది కాలంగా మంచి రిటర్న్స్ అందించినవి. అంతమాత్రాన ఇతర పారామితుల ఆధారంగా వీటిల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించడం లేదు. నిపుణుల సలహాలతో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. ఇక, గత ఏడాది కాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన మూడు ఫండ్స్లో ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్ 58.09 శాతం, నిప్పోన్ ఇండియా లార్జ్క్యాప్ ఫండ్ 50.70 శాతం, ఐడీబీఐ ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్ 48.83 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.
ఫండ్స్ను పరిశీలించవచ్చు కానీ
పెట్టుబడులు ఇప్పుడే ప్రారంభించే వారు లార్జ్ క్యాప్ ఫండ్స్ను పరిశీలించవచ్చు. ఆయా మ్యూచువల్ ఫండ్స్ టాప్ 5 హోల్డింగ్స్ ముప్పై శాతం నుండి 40 శాతం పోర్ట్పోలియోను కలిగి ఉంటాయి. ప్రధానంగా ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ వంటి స్టాక్స్ను ఎక్కువగా చూస్తారు. ఫండ్స్ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మంచి పనితీరు కనబరిచిన మ్యూచువల్ ఫండ్ రేపు బాగా పని చేస్తుందని చెప్పలేం. పెట్టుబడి పెట్టడానికి మార్నింగ్ స్టార్, క్రిసిల్ వంటి ఏజెన్సీలు వివిధ మ్యూచువల్ ఫండ్స్కు ఇచ్చిన రేటింగ్స్ను పరిశీలించాలి. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు ఈ రేటింగ్ ఇవ్వడానికి కఠిన అంశాలను తీసుకుంటాయి. అలా అని పూర్తిగా రేటింగ్ పైన ఆధారపడవద్దు.
ఇది గుర్తుంచుకోండి
పెట్టుబడి పెట్టడానికి అనువైన మార్గం సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP). మార్కెట్లు గత కొంతకాలంగా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం రిస్క్తో కూడుకున్న అంశం. సెన్సెక్స్ ప్రస్తు తం జీవన కాల గరిష్టం 53,000 సమీపంలో ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించాలి.
రేటింగ్ ఇలా
ఇక ఫండ్స్ విషయానికి వస్తే ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్కు వ్యాల్యూ రీసెర్చ్ 2 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇందులో రూ.5000 నుండి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. నిప్పోన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్కు, ఐడీబీఐ ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్స్కు కూడా వ్యాల్యూ రీసెర్చ్ టూ స్టార్ రేటింగ్ ఇచ్చింది. సిప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి. ఈ ఆర్టికల్ సమాచార ప్రయోజనం కోసం అందించడమైనది. కానీ పెట్టుబడికి సూచనగా భావించరాదు. నిపుణుల సలహాలు అవసరం.