Post Office Schemes: మంచి రాబడినిచ్చే ఆ మూడు ఫోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ గురించి మీకు తెలుసా..? ఎన్నో లాభాలు..
దేశంలో చాలా మందికి ఇప్పటికీ పొదుపు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఫోస్టాఫీసే. దానితో తరతరాలుగా భారతీయులకు ఉన్న అనుబంధం అలాంటిది. అందువల్లనే అనేక మంది తమ పెట్టుబడులను అనేక పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ లో సేవ్ చేయాలని అనుకుంటుంటారు. ఇలాంటి కస్టమర్ల కోసమే ప్రభుత్వ రంగానికి చెందిన భారతీయ పోస్ట్ ఆఫీస్ అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. అలాగే.. మీ డబ్బు కూడా ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని పోస్టాఫీస్ పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF):
పెట్టుబడి పెట్టడానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక గొప్ప పథకం. ఈ పథకంలో మీరు ఏడాదికి కనీసం రూ. 500 నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పెట్టుబడి మొత్తంపై 7.1 శాతం వడ్డీ రేటు పొందుతారు. ఈ స్కీమ్ లో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఇవ్వబడుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం లాక్ ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు ఉంటుంది. అయితే.. మీరు దానిని 15 ఏళ్ల తరువాత మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి, మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీమ్లో మీ డబ్బు 120 నెలల్లో (10 సంవత్సరాల్లో) రెట్టింపు అవుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 80C కింద టాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS).. 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ఉద్దేశించినవి. అయితే.. కొన్ని షరతులతో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టే వయస్సు 55 గా నిర్ణయించబడింది. అదే సమయంలో కొన్ని షరతులతో రక్షణ రంగం నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ వయస్సు 50 సంవత్సరాలకు కుదించబడింది. ఈ స్కీమ్ లో పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలుగా ఉంది. ఇందులో చేసే పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఈ పథకంలో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్-80C కింద మినహాయింపు కూడా లభిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన (SSY):
సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం తీసుకురాబడిన మంచి స్కీమ్. ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం కింద.. 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీమ్ కింద.. డిపాజిట్ కనీస మొత్తం రూ. 250 ఉండగా.. గరిష్ట మొత్తం రూ. 1.5 లక్షల వరకూ నిర్ణయించబడింది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాలు లేదా కుమార్తె వయస్సు 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహ సమయంలో మెచ్యూర్ అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన కింద పొదుపు చేసేందుకు ఏదైనా పోస్టాఫీసు లేదా బ్యాంకులో ఖాతాను తెరవవచ్చు. ఇలా పోస్టాఫీస్ లో ఉన్న స్కీమ్స్ లో పై మూడు ఉత్తమమైనవిగా చెప్పుకోవచ్చు. అందులోనూ వీటికి మంచి వడ్డీ రేటు లభించటం ఎక్కువ మందిని పెట్టుబడి పెట్టే విధంగా ఆకర్షిస్తోంది.