ఆ డీల్ తర్వాత టాటా మోటార్స్ అదుర్స్, ఏడాదిలో దాదాపు 300 శాతం రిటర్న్స్
టాటా మోటార్స్ షేర్ పరుగులు పెడుతోంది. నేడు (అక్టోబర్ 13, బుధవారం) ఈ స్టాక్ ఏకంగా 20 శాతానికి పైగా లాభపడింది. టాటా మోటార్స్-టీపీజీ డీల్ అనంతరం దాదాపు టాటా గ్రూప్ షేర్లు అన్ని కూడా లాభపడ్డాయి. టాటా మోటార్స్ షేర్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది. నేడు ఈ స్టాక్ 21.11 శాతం లేదా రూ.88.85 లాభపడి రూ.509.70 వద్ద ముగిసింది. నేడు టాటా గ్రూప్ స్టాక్స్ అన్నీ లాభాల్లోనే ముగిశాయి. టీపీజీ డీల్ అనంతరం టాటా మోటార్స్ షేర్ హోల్డర్లపై సిరుల వర్షం కురిసింది. ఈ స్టాక్ ఓ సమయంలో 22 శాతం లాభపడి రూ.523కు చేరుకుంది. తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ రూ.509 వద్ద ముగిసింది. నేడు టాటా మోటార్స్ ఇన్వెస్టర్లకు లాభాల పంటపండింది.
టాటా మోటార్స్ స్టాక్
టాటా మోటార్స్ విద్యుత్ వాహన విభాగంలోకి టీపీజీ రైజ్ క్లైమేట్ నుండి బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.7500 కోట్లు సమీకరించడం ఇందుకు కారణం. ఉదయం ఈ స్టాక రూ.462 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఏడాది క్రితం రూ.126 వద్ద ట్రేడ్ అయిన ఈ స్టాక్ ఈ కాలంలో 415 శాతం లాభపడింది. గత మూడు రోజుల్లో ఈ స్టాక్ వ్యాల్యూ 46 శాతం పెరిగింది.
టాటా మోటార్స్ సాట్క్ 509.70 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో 42 శాతానికి పైగా లాభపడింది. నెలలో 66 శాతం, ఆరు నెలల కాలంలో 68 శాతం, ఏడాదిలో 290 శాతం, 2021లో జనవరి 1 నుండి 173 శాతం ఎగిసింది. అయితే ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్టం 550కి పైన ఉంది.
డిమాండ్ పుంజుకుంటోంది
దేశంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పుంజుకుంటోంది. ఈ రంగంలో వచ్చే అవకాశాలను టాటా మోటార్స్ వేగంగా అందిపుచ్చుకుంటోంది. ఇన్వెస్టర్లకు కంపెనీపై విశ్వాసం పెరిగింది. భారత్లో వేగంగా పురోగతి సాధిస్తున్న విద్యుత్ వాహన కంపెనీల్లో టాటా మోటార్స్ ముందు నిలిచింది. ఒక్క వాహన తయారీకే పరిమితం కాకుండా బ్యాటరీలు, ఛార్జింగ్ వసతులతో పాటు విద్యుత్ వాహన రంగానికి కావాల్సిన ఇతర సదుపాయాల కల్పన విషయంలో టాటా మోటార్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
పైగా టాటా గ్రూప్లోని ఇతర కంపెనీలు కూడా బాగా రాణిస్తుండడంతో టాటా బ్రాండ్ వ్యాల్యూ స్టాక్ ధరల పెరుగుదలకు దోహదపడుతోంది. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ సమావేశంలో టాటా మోటార్స్ తయారు చేస్తున్న విద్యుత్ వాహనాలు టెస్లా కార్లకు తీసిపోవని ప్రశంసించారు.
2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం విద్యుత్ వాహనాల్ని తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యంలో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో టాటా మోటార్స్ షేర్లు దూసుకెళ్లాయి.
దఫాలుగా పెట్టుబడులు
ప్రయాణీకుల విద్యుత్ వాహన విభాగంలోకి టీపీజీ రైజ్ క్లైమేట్ నుండి బిలియన్ డాలర్లు సమీకరిస్తున్నట్లు టాటా మోటార్స్ బుధవారం ప్రకటించింది. టాటా మోటార్స్, ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీకి చెందిన టీపీజీ రైజింగ్ క్లైమేట్ బైండింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం టీపీజీ రైజ్ క్లైమేట్ తన సహ పెట్టుడిదారు అబుదాబీ ప్రభుత్వ భాగస్వామ్య సంస్థతో కలిసి కొత్తగా ఏర్పాటు కానున్న టాటా మోటార్స్ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెడతాయి. సంస్థ వ్యాల్యూ 9.1 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఇందులో టీపీజీ గ్రూప్ వాటా 11 శాతం నుండి 15 శాతం. 18 నెలల్లో పెట్టుబడులు పలుదఫాలుగా వస్తాయి.