Stocks to buy: ఈ 4 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు
స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం సరికొత్త రికార్డుకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిశగా, నిఫ్టీ 16,500 పాయింట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ వారంలో నాలుగు రోజులు కూడా సూచీలు అంతకంతకూ పైపైకి చేరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్టాక్స్ పతనం చెందినప్పుడు కొనడం, సరికొత్త గరిష్టాలకు చేరుకున్నప్పుడు విక్రయించాలనేది సాధారణ మార్కెట్ పెట్టుబడి సూత్రం.
ప్రస్తుతం సూచీలు రికార్డ్ గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో స్టాక్స్లో పెట్టుబడికి కాస్త ధైర్యం అవసరం. అంటే రిస్క్ చేయడమే. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం సూచీలు గరిష్టస్థాయిలో ఉన్నా రిస్క్ అని భావించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో పెట్టుబడుల కోసం ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ సూచీలను సజెస్ట్ చేస్తోంది.
డాబూర్ ఇండియా
డాబుర్ ఇండియా స్టాక్ 18 శాతం అప్సైడ్ టార్గెట్తో కొనుగోలు చేయవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. మున్ముందు త్రైమాసికాలు హెల్త్ కేర్ వ్యాపారానికి సవాల్గా మారుతున్నప్పటికీ, FY22లో నిర్వహణ విశ్వాసం రెండకెల వృద్ధిరేటుకు అవకాశాలు ఉన్నాయని ఈ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. డాబుర్ ఇండియా గత మూడేళ్ల కాలంలో రెండు సంవత్సరాలు రెండంకెల వృద్ధి రేటును నమోదు చేసింది.
తోటి కంపెనీల ఎలా ఉన్నప్పటికీ ఈ సంస్థ మాత్రం FY22లో మళ్లీ మంచి వృద్ధిని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాబుర్ కొత్త ఉత్పత్తుల సేల్ వృద్ధి ఐదు శాతం నుండి ఆరు శాతం అమ్మకాలతో వృద్ధికి దోహదపడవచ్చునని తెలిపింది. ప్రస్తుతం రూ.603 వద్ద ఉన్న ఈ స్టాక్ 18 శాతం లాభపడి రూ.714కు చేరుకోవచ్చునని తెలిపింది.
కాస్ట్రోల్
కాస్ట్రోల్ స్టాక్ 22 శాతం అప్సైడ్ టార్గెట్తో కొనుగోలు చేయవచ్చునని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. బ్రోకరేజీ సంస్థ ప్రకారం డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో మంచి వృద్ధి నమోదు కావొచ్చునని అంచనా వేస్తోంది. కాస్ట్రోల్ ఎప్పుడు కూడా తన బ్రాండ్ ఈక్విటీ వారసత్వాన్ని అందిస్తోందని, మెరుగైన ఉత్పత్తి, వ్యయ నియంత్రణ వంటి అంశాలతో లాభదాయకత కొనసాగవచ్చునని పేర్కొంది. ప్రస్తుతం క్యాస్ట్రోల్ స్టాక్ ధర రూ.140 వద్ద ఉంది. ఇది 22 శాతం లాభపడి రూ.170కి చేరుకోవచ్చునని పేర్కొంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు
పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) స్టాక్ 11 శాతం అప్సైడ్ టార్గెట్తో కొనుగోలు చేయవచ్చునని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు పెరగడం, కార్యకలాపాల ఖర్చులు తగ్గడం వంటివి కలిసి వచ్చాయి. త్రైమాసికం పరంగా ఈసారి మంచి ఫలితాలు సాధించింది. వ్యాపార వృద్ధి స్థిరంగా కనిపిస్తోందని, అయితే మార్జిన్స్ వరుసగా పెరుగుతున్నాయని, కార్పోరేట్ బుక్ కూడా క్రమంగా కోలుకుంటోందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది. అసెట్ క్వాలిటీ స్టేబుల్గా ఉందని తెలిపింది.
భారతీ ఎయిర్ టెల్
భారతీ ఎయిర్ టెల్ స్టాక్ 11 శాతం అప్సైడ్ టార్గెట్తో కొనుగోలు చేయవచ్చునని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ చెబుతోంది. ఈ స్టాక్ విషయంలో కూడా బ్రోకరేజీ సంస్థ బుల్లిష్గా ఉంది. ఎయిర్ టెల్ అంతకంతకూ వృద్ధి నమోదు చేయడంతో పాటు ఆఫ్రికాలో వ్యాపారం పెరుగుతోందని, వ్యాపారం మంచి వృద్ధి కనబరుస్తోందని తెలిపింది. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం ఎబిటా గత ఏడాది కంటే 30 శాతం అధికంగా ఉంది. ఈ స్టాక్ను కొనుగోలు చేయాలని సూచించినప్పటికీ, టార్గెట్ ధరను పేర్కొనలేదు.