Samvat 2077: ఇన్ఫోసిస్ సహా ఈ స్టాక్స్ భారీ రిటర్న్స్ ఇచ్చే అవకాశం
హిందూ క్యాలెండర్ 2076లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కొత్త ఏడాది 2077లో పలు రంగాల స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థలు భావిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆంగ్లనామ సంవత్సరం 2020లో మార్కెట్లు తీవ్ర నష్టాలను, అదే సమయంలో రికార్డు గరిష్టాన్ని తాకాయి. కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం నేడు ముహూరత్ ట్రేడింగ్ డే. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం కొన్ని స్టాక్స్ 50 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చునని బ్రోకరింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
మూడేళ్ల కనిష్టం నుండి రికార్డ్ గరిష్టానికి..
కరోనా కారణంగా మార్కెట్లు మార్చి నెలలో మూడేళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఆ తర్వాత 62 శాతం మేర లాభాలు సాధించి సరికొత్త రికార్డులు కూడా సృష్టించాయి. ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీ జీవనకాల గరిష్టాన్ని తాకాయి. సంవత్ 2076లో నిఫ్టీ 5.5 శాతం మేర లాభపడింది. సంవత్ 2077లోను పలు స్టాక్స్ పైన బ్రోకరేజీ సంస్థలు భారీ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఐటీ, ఫార్మా, టెలికమ్యూనికేషన్ స్టాక్స్ ఉన్నాయ.
ఇన్ఫోసిస్ టార్గెట్ ప్రైస్ రూ.1400
- జైడూస్ వెల్నెస్ కంపెనీ వచ్చే ఏడాది నాటికి రుణాలన్నింటిని చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 9.1 శాతం, 35.4 శాతం మేర లాభాలు నమోదు చేయనుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.1821 వద్ద ఉంది. టార్గెట్ ధర రూ.2300గా అంచనా వేస్తున్నారు.
- ఎస్బీఐ లైఫ్ స్టాక్ ప్రస్తుతం రూ.833.50 వద్ద ఉంది. దీని టార్గెట్ ధరను రూ.1000గా అంచనా వేస్తున్నారు. బ్రాండ్, ఆఫరేషన్ ఎఫిషియెన్సీ వంటి వివిధ కారణాలతో ఈ స్టాక్ పుంజుకుంటుందని చెబుతున్నారు.
- ఐటీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ టార్గెట్ ధరను రూ.1400గా(24 శాతం) అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ రెవెన్యూ గ్రోత్ టీసీఎస్ను దాటవచ్చునని, పదిహేనేళ్లలో ఇదే మొదటిసారి అని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్ టెల్ కూడా
- మణప్పురం ఫైనాన్స్ స్టాక్ ధర ప్రస్తుతం రూ.164 వద్ద ఉంది. ఈ స్టాక్ 42 శాతం కంటే ఎక్కువగా వృద్ధి నమోద చేస్తుందని చెబుతూ టార్గెట్ ధరను రూ.225గా అంచనా వేస్తున్నారు.
- టెలికం రంగానికి వస్తే భారతీ ఎయిర్టెల్ స్టాక్ ధర ప్రస్తుతం రూ.477 వద్ద ఉంది. ఈ స్టాక్ 36 శాతం మేర ఎగిసి రూ.650కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జియో కారణంగా గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
- ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ స్టాక్ ధర ప్రస్తుతం రూ.230 వద్ద ఉంది. ఇది 28 శాతం ఎగిసి రూ.300ను తాకుతుందని అంచనా వేస్తున్నారు.
- ఫార్మాలో అలెంబిక్ ఫార్మా 41 శాతం లాభపడుతుందని భావిస్తున్నారు. టార్గెట్ ధరను రూ.1360గా అంచనా వేస్తున్నారు.