ఈ వారం స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతుందా, బంగారం ధరలు పెరుగుతాయా?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు అప్రమత్తంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతవారం వరుసగా నాలుగు సెషన్లు నష్టపోయిన సెన్సెక్స్, ఈ వారం ప్రారంభంలోనే మళ్లీ కుప్పకూలింది. సెన్సెక్స్ నేడు ఉదయం గం.10 సమయానికి ఏకంగా 615 పాయింట్లు పతనమై 58,430 పాయింట్ల దిగువకు చేరింది. బంగారం ధరలు కూడా వేగంగా పరుగెడుతున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,500 సమీపానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 1840 డాలర్లను సమీపించింది.
సెన్సెక్స్ నిరోధకం
బలహీన అంతర్జాతీ సంకేతాల ప్రభావంతో గతవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్భణ భయాల దృష్ట్యా అమెరికా ఫెడ్ రిజర్వ్ సహా పలు దేశాల కేంద్రబ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుకు సిద్ధమయ్యాయి. దేశీయంగా కూడా మార్కెట్కు సానుకూల అంశాలు లేకపోవడంతో వరుసగా ఐదో రోజు నష్టాల్లో కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 58,620 పాయింట్ల దిగువకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది 58,000 పాయింట్లకు కూడా పతనం కావొచ్చునని, ఆ స్థాయి దిగువకు చేరుకుంటే 57,400 పాయింట్లకు తగ్గవచ్చునని మార్కెట్ వర్గాల అంచనా. 59,500 నుండి 60,000 మధ్య నిరోధకం ఉండవచ్చు.
నిఫ్టీ మద్దతు, నిరోధకం
సెన్సెక్స్ ఇమ్మీడియేట్ మద్దతు 58,620, 58,000గా అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే మరింత క్షీణించి 57,500 దిగువకు పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇమ్మీడియేట్ నిరోధకం 59,330, 60,050 వద్ద కనిపిస్తోంది.నిఫ్టీ కూడా గతవారం భారీగా నష్టపోయింది. ప్రస్తుతం 17400 పాయింట్ల స్థాయిలో ఉంది. నిఫ్టీ మద్దతు స్థాయి 17,300 వద్ద, నిరోధకం 17,850 పాయింట్ల వద్ద కనిపిస్తోంది.
బంగారం, వెండి ధరలు
బంగారం ధరలు ఈ వారం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ నిర్ణయం ప్రభావం గోల్డ్ ఫ్యూచర్ పైన కీలకంగా మారుతుంది. అయితే రూ.47,800 కంటే దిగువకు రానంత వరకు సానుకూలంగానే ఉండవచ్చునని, రూ.48,700 స్థాయిలో నిరోధకం ఉండవచ్చునని చెబుతున్నారు. అయితే రూ.47,800 కంటే దిగువకు వస్తే మాత్రం రూ.47500 కిందకు పడిపోవచ్చునని అంటున్నారు. వెండి నిరోధకం రూ.67,840 వద్ద కనిపిస్తోంది.