ఈ వారం స్టాక్ మార్కెట్ మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధర పెరుగుతుందా?
ఆర్బీఐ మానిటరీ పాలసీ, వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు ఊగిసలాటలో కొనసాగవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా. ఆర్బీఐ MPC సమావేశం 8వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన గవర్నర్ నిర్ణయాలను వెలువరిస్తారు. సోమ-బుధవారాల్లో జరగాల్సిన సమావేశం, ప్రసిద్ధగాయని లతా మంగేష్కర్ మరణం కారణంగా మహారాష్ట్రలో సంతాపదినం ప్రకటించారు. దీంతో ఆర్బీఐ MPC సమావేశాన్ని ఒకరోజు వాయిదా వేశారు.
ద్రవ్యోల్భణం, ద్రవ్యలోటు, పెరుగుతున్న ముడిచమురు ధరలను ఆర్బీఐ పరిగణలోకి తీసుకుంటుంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను అతి స్వల్పంగా పెంచవచ్చు లేదా యథాతథంగా కొనసాగించవచ్చు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆర్బీఐ వైపు దృష్టి సారించాయి.
ఈ వారం మద్దతు, నిరోధకం
సెన్సెక్స్, నిఫ్టీలు ఈ వారం ఊగిసలాటలో ఉండవచ్చునని అంచనాలు ఉన్నాయి. సెన్సెక్స్ గతవారం 2.5 శాతం ఎగిసి 58,645 పాయింట్ల వద్ద, నిఫ్టీ దాదాపు అంతేస్థాయిలో లాభపడి 17,516 పాయింట్ల వద్ద ముగిసింది. సాంకేతికంగా చూస్తే 50 ప్యాక్ నిఫ్టీ ఇండెక్స్ ఈ వారం 18,000 మార్కును క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
17,800 వద్ద నిరోధకం, 17,400 వద్ద మద్దతు ధర కనిపిస్తోంది. 30 ప్యాక్ బీఎస్ఈ సెన్సెక్స్ 57,400 నుండి 59,750 పాయింట్ల మధ్య కదలాడవచ్చు. 57,850 పాయింట్ల వద్ద మద్దతు, 59,300 పాయింట్ల వద్ద నిరోధకం కనిపిస్తోంది.
వీటి ప్రభావం
ప్రధానంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం ప్రభావం మార్కెట్ పైన ఉంటుంది. అలాగే ఫెడ్ వడ్డీ రేటు అంశం కూడా ప్రభావం చూపవచ్చు. వివిధ కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ ఫలితాల ప్రభావంతో పాటు ఒమిక్రాన్ ప్రభావం ఉంటుంది. మన వద్ద బడ్జెట్ అనంతరం టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ద్రవ్యోల్భమం,. ద్రవ్యలోటు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాల ప్రభావమూ ఉంటుంది.
ధరలు మరింత పెరుగుతాయా?
బంగారం ధరలు కూడా ఈ వారం స్వల్ప తగ్గుదల లేదా పెరుగుదలను నమోదు చేయవచ్చునని బులియన్ మార్కెట్ వర్గాల అంచనా. పసిడి ధరలు గతవారం రూ.48,000కు దిగువనే ముగిశాయి. కానీ ఈ వారం రూ.48,500 వరకు చేరుకోవచ్చునని, ఈ స్థాయిలోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వెండి ధరలు గతవారం రూ.61,000 దిగువన ముగిశాయి. ఈ వారం రూ.62,000ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేటు పెంపు అంశంపై మరింత స్పష్టత వస్తే మాత్రమే తగ్గవచ్చునని భావిస్తున్నారు.