4 వారాల్లో అతిపెద్ద పతనం, ఇన్వెస్ట్ చేస్తున్నారా.. కాస్త జాగ్రత్త!
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, జనవరి 15) భారీ నష్టాల్లో నష్టాల్లో ముగిశాయి. 550 పాయింట్ల భారీ నష్టంతో ముగిసిన సెన్సెక్స్ నేడు 850 పాయింట్ల నష్టం మధ్య కదలాడింది. గత రెండు నెలలుగా సూచీలు అంతకంతకూ ఎగిసిపడుతున్నాయి. కరెక్షన్ ఎప్పుడైనా ఉండవచ్చునని ఇప్పటికే మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు రెండు నెలల్లోనే సెన్సెక్స్ 7వేల పాయింట్లు ఎగబాకింది. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సీన్, ఎఫ్పీఐల వెల్లువ, రిటైల్ ఇన్వెస్టర్ల జోరు, ఐటీ సహా వివిధ రంగాలు పుంజుకోవడం వంటి కారణాలతో సూచీలు పరుగెడుతున్నాయి. అయితే నేడు భారీ నష్టాల్లో ముగిశాయి.
ఆ తర్వాత భారీ దిద్దుబాటు
గత ఏడాది డిసెంబర్ 21వ తేదీ తర్వాత మార్కెట్లు భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. అప్పుడు మార్కెట్లు దాదాపు 3 శాతానికి పైగా పడిపోయాయి. మూడు వారాలుగా సూచీలు అప్పుడప్పుడు స్వల్పంగా నష్టపోతున్నప్పటికీ సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. మొత్తంగా సెన్సెక్స్ 11 వారాలు లాభాల్లో ముగిసింది. సూచీలు ఎప్పటికప్పుడు ఊహించనిరీతిలో ఎగుస్తున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, కరెక్షన్ మళ్లీ కొట్టి పారేయలేమని అంటున్నారు.
లాభాల స్వీకరణ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జోబిడెన్ గురువారం 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ఆశించిన మేర లేకపోవడంతో ఈ ప్రభావం మార్కెట్లపై ఉంటుందని చెబుతున్నారు. వాల్ స్ట్రీట్ సూచీలపై ప్రతికూల ప్రభావం, ఆసియా మార్కెట్లపై పడింది. ఇక, ఇటీవలి కాలంలో మార్కెట్లలోకి భారీగాపెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు చిన్న నుండి పెద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం నేడు ప్రభావం చూపిందని అంటున్నారు.
ఆ మార్కు చేరవచ్చు
నిఫ్టీ త్వరలో 14650 మార్కును తాకవచ్చునని, అయితే అంతకుముందే కరెక్షన్ కొట్టి పారేయలేమని అంటున్నారు. వయోటిలిటీ ఇండెక్స్ ఈ వారం 16 శాతం కంటే ఎక్కువ ఉంది. ఇది సానుకూలం కాదంటున్నారు. ప్రీవియస్ సెషన్స్ కంటే ఎన్ఎస్ఈలో వ్యాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే వివిధ కంపెనీల డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు, పెట్టుబడుల ప్రభావంపై సూచీలు ఆధారపడి ఉంటాయి.