రూ.72 లక్షల కోట్ల సంపద పెరిగింది: 2022లో 70,000కు సెన్సెక్స్?
భారత మార్కెట్ 2021 సంవత్సరంలో అదిరిపోయే ర్యాలీనీ చూసింది. వచ్చే సంవత్సరం కూడా మార్కెట్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. దీర్ఘకాలంలో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఈక్విటీ స్ట్రాటెజిస్ట్ హెడ్ రిధమ్ దేశాయ్ మాట్లాడుతూ... సెన్సెక్స్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 70,000 మార్కుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని, అంటే డిసెంబర్ 2022 నాటికి ఇది 16 శాతం పెరుగుదల అవుతుందని చెప్పారు. బీఎస్ఈ సెన్సెక్స్ 25 సంవత్సరాల యావరేజ్ 19.7Xగా ఉంది. స్టాక్ మార్కెట్లు ఇటీవల 60,000కు దిగువన ఉన్నాయి.
అలా అయితే 80,000 పాయింట్లకు
2021 ఏడాదిలో సెన్సెక్స్ దాదాపు 22 శాతం మేర ర్యాలీ చేసింది. అదే సమయంలో నిఫ్టీ 25 శాతం ఎగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 38.95 శాతం, 53.03 శాతం లాభపడ్డాయి. 2022 కొత్త ఏడాదిలోను మార్కెట్ పరుగులు పెట్టవచ్చునని, సెన్సెక్స్ 70,000 మార్కుకు చేరుకోవచ్చునని, బుల్ రన్ ప్రస్తుత ఏడాది వలె కొనసాగితే 80,000 మార్కుకు చేరుకోవచ్చునని అంటున్నారు. అయితే ఈ మార్కుకు చేరుకోవడానికి పలు అంశాలు ప్రభావం చూపుతాయి.
స్టాక్ మార్కెట్ పైన వీటి ప్రభావం
భారతీయ ఈక్విటీలు యూఎస్ రేట్ సైకిల్, పెరుగుతున్న చమురు ధరలు, కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు, థర్డ్ వేవ్ - ఒమిక్రాన్ ప్రభావం, దేశీయ వడ్డీ రేట్లలో పెరుగుదల, రిచ్ హెడ్ లైన్ వ్యాల్యుయేషన్ సహా వివిధ అనేక అంశాలు, సవాళ్లు ఉన్నాయి. ఇటీవల పేటీఎం ఐపీవో ఆకట్టుకోలేకపోయింది. ఈ వైఫల్యం రాబోయే టెక్ స్టార్టప్స్ ఐపీవోలపై పడుతుందని అంచనా వేస్తున్నారు.
72 లక్షల కోట్లు పెరిగింది
2021 క్యాలెండర్ సంవత్సరంలో ఇన్వెస్టర్ల సంపద 72 లక్షల కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.60 లక్షల కోట్లకు చేరుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 2021లోనే మొదటిసారి 50,000 మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. గత అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు చేరుకుంది. ఒమిక్రాన్ సహా వివిధ అంశాలు ప్రభావం చూపి తిరిగి 60,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టంతో దాదాపు 5000 పాయింట్లు తక్కువగా ఉంది. బీఎస్ఈ 30 షేర్ బెంచ్ మార్క్ ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 20 శాతం రాబడిని అందించాయి.
ఇతర దేశాల మార్కెట్తో పోలిస్తే ఇది ఎక్కువే. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో 27.11గా ఉంది. గత ఇరవై ఏళ్ల సగటుతో చూస్తే ప్రస్తుతం ఇన్వెస్టర్లకు లాభదాయకంగా ఉంది. అయితే భారత మార్కెట్తో పాటు ఇతర కొన్ని మార్కెట్లు కూడా అలాగే ఉన్నాయి.