ఆరు నెలల్లో 7500 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, కొనుగోలుకు సరైన సమయమా?
స్టాక్ మార్కెట్లు 2022 క్యాలెండర్ ఏడాదిలో భారీగా పతనమయ్యాయి. కరోనా తర్వాత మార్కెట్లు కోలుకుంటున్నాయని భావించిన సమయంలో రష్యా - ఉక్రెయిన్ భారీగా దెబ్బతీసింది. దీంతో మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్భణ ఆందోళనలు, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపాయి. మార్చి 2020 తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు మరోసారి దారుణ పతనాన్ని నమోదు చేశాయి. 2022 క్యాలెండర్ ఏడాదిలో బీఎస్ఈ సెన్సెక్స్ 7500 పాయింట్లు, నిఫ్టీ 2200 పాయింట్లకు పైగా పతనమైంది.
మరింత కాలం ఒత్తిడిలో
ద్రవ్యోల్భణ ఆందోళనలు, 2022 క్యాలెండర్ ఏడాదిలో మరిన్నిసార్లు కీలక వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపుతాయని, దీనికి తోడు ఆర్థిక మందగమనం, ఆర్థిక సంక్షోభం భయాలు కమ్ముకున్నాయని, దీంతో మార్కెట్లు మరింతకాలం ఒత్తిడిలోనే ఉండవచ్చునని మార్కెట్ నిపుణుల చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువగా కొనుగోలు చేసి, ఎక్కువగా విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే మరింత కాలం ఒత్తిడిలోనే ఉండే అవకాశముందని, కానీ ఇప్పటికే ఉన్న మంచి స్టాక్స్ అట్టి పెట్టుకోవడం మంచిదని నిపుణుల మాట.
వేచి చూడాలి
మార్కెట్ను కచ్చితంగా అంచనా వేయడం ఎవరికైనా కష్టమే. అయితే ప్రస్తుతం వడ్డీ రేటు పెంపు, ద్రవ్యోల్భణ భయాలు, సంక్షోభ ఆందోళనల నేపథ్యంలో ఇంకొంతకాలం ఒత్తిడిలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ప్రస్తుత అనిశ్చితి కాలంలో పెట్టుబడి పెట్టవచ్చునని, అయితే మార్కెట్ కొంతకాలం ఒత్తిడిలో ఉంటుంది కాబట్టి మధ్య కాలానికి వేచి చూడాలని అంటున్నారు.
ఊగిసలాటలో ఉన్నప్పటికీ..
మార్కెట్లు మరికొంత కాలం ఊగిసలాటలో ఉన్నప్పటికీ, అది కొద్దిగా మాత్రమే ఉంటుందని, కాబట్టి కొనుగోలుపై పెద్దగా ప్రభావం చూడకపోవచ్చునని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేసినా పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు. మార్కెట్లు కనిష్టానికి పడిపోయినప్పుడు మంచి స్టాక్స్ లేదా రంగాలను ఎంచుకొని కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.