ఆర్బీఐ రెపో రేటు పెంపు ఎఫెక్ట్: ఈ బ్యాంకులు వడ్డీ రేటు పెంచాయ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటు పెంపు నేపథ్యంలో వివిధ బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల పెంపు బాటను పట్టాయి. మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రయివేటురంగ బ్యాంకులు సోమవారం వడ్డీ రేట్లను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో ప్రయివేటు దిగ్గజం HDFC బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు ఉన్నాయి. ప్రభుత్వరంగానికి చెందిన కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచాయి. వివిధ బ్యాంకుల వడ్డీ రేటును పరిశీలిస్తే....
ICICI బ్యాంకు
ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటును పెంచింది. ఇది మే 4వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఆర్బీఐ ఇటీవల వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఐసీఐసీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు (I-EBLR)ను 8.10 శాతానికి పెంచుతున్నామని, ఇది 4వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని తన వెబ్ సైట్లో పేర్కొంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు
పంజాబ్ నేషనల్ బ్యాంకు రెపో లింక్డ్ లెండింగ్ రేటును (RLLR)ను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. సవరించిన ఆర్ఎల్ఎల్ఆర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు జూన్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని, కొత్త కస్టమర్లకు మే 7 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటు మే 5వ తేదీ నుండి పెరిగింది. ఈ బ్యాంకు రిటైల్ లోన్ వడ్డీ రేటును 6.90 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్బీఐ రెపో రేటు 4.4 శాతం, మేక్-అప్ 2.50 శాతానికి పెంచింది.
HDFC బ్యాంకు
మేజర్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రొవైడర్ హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్స్ ఆర్పీఎల్ఆర్ రేటు 30 బేసిస్ పాయింట్లు పెంచింది.
కరూర్ వైశ్య బ్యాంకు రెపో రేటు ఆధారిత వడ్డీ రేటును 7.15 శాతం నుండి 7.45 శాతానికి పెంచింది. ఇది మే 9 నుండి అమల్లోకి వచ్చింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రెపో ఆధారిత రుణ రేటు 7.25 శాతానికి సవరించింది. ఇది మే 10 నుండి అమల్లోకి వచ్చింది.
కెనరా బ్యాంకు రెపో ఆధారిత రుణ రేటు మే 7వ తేదీ నుండి 7.30 శాతానికి అమల్లోకి వచ్చింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది.
కొటక్ మహీంద్రా, బంధన్ బ్యాంకు
కొటక్ మహీంద్రా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ పైన మే 6వ తేదీ నుండి పెంపును అమలు చేస్తోంది. ఏడాది కాలపరిమితిపై వడ్డీ రేటు 5.25 శాతంగా ఉంది.
బంధన్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇది మే 4వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది.