నష్టభయం ఉన్నవాటిలో ఇన్వెస్ట్ చేయలేకే, పీఎఫ్ వడ్డీ తగ్గింపుతో తగ్గే ఆదాయం రూ.432
ప్రభుత్వ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించింది. తాజా సవరణలో భాగంగా ఇప్పటి వరకు 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.1 శాతానికి సవరించింది. అంతకుముందు (2020-21) ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును 8.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించింది. 65 మిలియన్ల యాక్టివ్ ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు ఇది కాస్త చేదు వార్త. ప్రధానంగా రిటైర్మెంట్ ఫండ్స్ సేవర్స్కు ఇది బ్యాడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎంప్లాయీస్ బేసిక్ శాలరీ నుండి 12 శాతం, యాజమాన్యం నుండి 12 శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
అందుకే పన్ను పరిధిలోకి
8.5 శాతం వడ్డీ రేటే అతి తక్కువ అని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు దీనిని 8.1 శాతానికి సవరించడంపై మరింత మండిపడుతున్నాయి. 43 ఏళ్ల తర్వాత ఇదే అత్యంత కనిష్ట వడ్డీ రేటు. 1952లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తవుతుంది. ఈపీఎఫ్ఓకు వచ్చిన మొత్తాన్ని ఈక్విటీ, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై వచ్చే లాభాన్ని వడ్డీగా చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది ఈపీఎఫ్ఓ.
గతంలో ఈపీఎఫ్ఓ బోర్డు సొంతగా నిర్ణయాలు తీసుకునేది. గత పుష్కరకాలంగా ఆర్థిక శాఖ సూచనల మేరకు వడ్డీ రేట్లు ఖరారవుతున్నాయి. చిన్న మొత్తాల పొదుపు వడ్డీ రేట్లతో పోలిస్తే ఈపీఎఫ్ఓలో ఇచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. దీంతో శాలరైడ్ పీఎఫ్ స్కీమ్స్ వైపు అదనపు సేవింగ్స్ కోసం మొగ్గు చూపుతున్నారు. ఈ పెట్టుబడులను నియంత్రించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తంపై వడ్డీని పన్ను పరిధిలోకి తీసుకు వచ్చారు.
ప్రస్తుతం అలా ఇన్వెస్ట్ చేయలేం
1977-78 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ స్థాయికి రాలేదు. అంటే 43 ఏళ్ల తర్వాత పీఎఫ్ వడ్డీని 8.1 శాతానికి సవరించింది. ఈ నలభై ఏళ్లలో 2010-11 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వద్ద గరిష్టంగా ఉంది. 2013-14 నాటికి 8.45 శాతానికి తగ్గించారు.ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు తగ్గింపుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 8.1 శాతానికి సిఫార్సు చేశామని, ఇప్పుడు నష్టభయం అధికంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేయలేమని, సామాజిక భద్రతను, మార్కెట్ స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి అన్నారు.
ఎంత తగ్గుతుంది?
ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి, యజమాని వాటా, ఈపీఎస్ పేరిట మూడు భాగాలు ఉంటాయి. ఈపీఎస్ భవిష్యత్తు పెన్షన్ నిధి. దీనిపై ఎలాంటి వడ్డీ ఉండదు. పీఎఫ్ ఖాతాలో వేతనం నుండి చెల్లించే నిర్బంధ చందాతో పాటు స్వచ్చందంగా చెల్లించే వీపీఎప్ చందా కలిపి ఉంటాయి. యజమాని వాటాలో ఈపీఎస్ చందాను తీసివేయగా, మిగతా మొత్తాన్ని యజమాని ఖాతాలాగా చూపిస్తారు.
ఉద్యోగి, యజమాని ఖాతాలోని మొత్తానికి కలిపి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. ఒక ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో కంపెనీ, ఉద్యోగి వాటా కలిసి రూ.1 లక్ష ఉంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ప్రకారం ఏడాదికి రూ.8839 వడ్డీ జమ అవుతుంది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం అంటే రూ.8407 జమ అవుతుంది. అంటే రూ.432 తగ్గుతుంది.