ఇన్వెస్టర్లూ జాగ్రత్త! ఈ ఏడాది 20 శాతం జంప్, 10 పతనం కావొచ్చు!!
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు, సెకండ్ వేవ్ తర్వాత కూడా అదే విధంగా పరుగులు పెడుతున్నాయి. థర్డ్ వేవ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ, ఆ భయాలు తొలగిపోతుండటంతో సూచీలు ఏ రోజుకు ఆ రోజు కొత్త రికార్డులను తాకుతున్నాయి. సెన్సెక్స్ నెల రోజుల్లో 4000 పాయింట్లు ఎగిసిపడింది. ఆగస్ట్ 4న 54,000 పాయింట్ల వద్ద ఉన్న ఈ సూచీ సెప్టెంబర్ 3వ తేదీ నాటికి 58,000 పాయింట్ల వద్ద ముగిసింది. థర్డ్ వేవ్ భయాలు పోయి, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడం, ఉద్యోగాల డేటా సానుకూలంగా ఉండటం, ఆటో సేల్స్ పెరగడం వంటి వివిధ కారణాలు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. మార్కెట్లు మరోసారి కరెక్షన్కు గురయ్యే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
10,000 పాయింట్లు జంప్
సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు పెట్టడం పట్ల మార్కెట్ నిపుణులు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్టర్లు, ముఖ్యంగా మొదటిసారి లేదా ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించిన వారు ప్రస్తుతం గరిష్టాన్ని తాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లు కరెక్షన్కు గురయ్యాయి. అయితే అది స్వల్పమే. కానీ మార్కెట్లలో మున్ముందు భారీ కుదుపు లేదా కరెక్షన్ ఉండవచ్చునని అంటున్నారు. సెన్సెక్స్ 2021లో ఇప్పటి వరకు ఇరవై శాతానికి పైగా ఎగిసిపడింది. అయితే అందులో సగం అంటే దాదాపు 10 శాతం మేర కరెక్షన్కు గురి కావొచ్చునని అంటున్నారు. జనవరి నెలలో సెన్సెక్స్ 50,000 వద్ద జర్నీని ప్రారంభించింది. కానీ సెకండ్ వేవ్ కారంగా 47,000 దిగువకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. ఆగస్ట్ 31వ తేదీ నాటికి 57,000 పాయింట్లు దాటి, సెప్టెంబర్ 3 నాటికి 58,000 పాయింట్లు క్రాస్ చేసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలో సెన్సెక్స్ 10,248.67 పాయింట్లు లేదా 21.4 శాతం ఎగిసిపడింది.
రిలయన్స్ అదుర్స్
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.2,54,21,578.88గా ఉంది. దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ నేడు భారీగా పెరిగింది. నేటి ట్రేడింగ్లో 4.15 శాతం లాభపడి రూ.2,388.25 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లను దాటింది. కంపెనీకి చెందిన రిటైల్ విభాగం సెర్చింజన్ ప్లాట్ఫామ్ జస్ట్ డయల్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉందనే విషయం వెలుగు చూడటంతో ర్యాలీ చేసింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.1514017.50 కోట్లుగా నమోదయింది. దేశీయ రెండో దిగ్గజం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.1420935.10గా ఉంది.
ఇప్పటికే కరెక్షన్ దిశగా
'ఇటీవల మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. మార్కెట్లు కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించే అవకాశముంది. కొద్ది రోజుల్లో పది శాతం కరెక్షన్కు గురయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. వాస్తవానికి ఇప్పటికే సూచీలు కన్సాలిడేషన్/కరెక్షన్ చూడటం ప్రారంభించాయి.' అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పథంలో ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్ ర్యాలీ, పతనం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ప్రాఫిట్ బుకింగ్ కూడా కీలకం.