LIC PMVVY scheme: నెలకు రూ.10వేల వరకు పెన్షన్ ఇలా...
ప్రధానమంత్రి వయ వందన యోజన(PMVVY) వయో వృద్ధులకు సామాజిక భద్రత కల్పించే పథకం. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఇందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పదవీ విరమణ తరువాత జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. 10 ఏళ్ల పాటు పెన్షన్ హామీ ఉంది. PMVVYని లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్(LIC) నిర్వహిస్తుంది. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండగా, దీనిని మార్చి 2023 వరకు పొడిగించారు.
PMVVY స్కీం వివరాలు
- ఈ స్కీంను మార్చి 2023 వరకు పొడిగించారు.
- ఈ స్కీంలో చేరేవారు 60 ఏళ్లు దాటాలి.
- గరిష్ట వయో పరిమితి లేదు.
- పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు.
- నెలకు కనీస పెన్షన్ మొత్తం రూ.1000. గరిష్ట పెన్షన్ మొత్తం రూ.10,000.
- పాలసీ కొనుగోలుకు వైద్య పరీక్షలు అవసరం లేదు.
- వయస్సు ధృవీకరణ గుర్తింపు కార్డు తప్పనిసరి.
- ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు పొందుపరచాలి.
ఇలా కొనుగోలు చేయాలి
PMVVY పాలసీ కొనుగోలు చేసిన తర్వాత మూడేళ్లకు రుణ సదుపాయాన్ని పొందవచ్చు. కొనుగోలు ధరలో గరిష్టంగా 75 శాతం మేరకు రుణం ఇస్తారు.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం కోసం పాలసీని స్వాధీనం చేసి 98 శాతం పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. సొంత వైద్య ఖర్చులతో పాటు జీవిత భాగస్వామి అనారోగ్య అవసరాలకు పాలసీని స్వాధీనపరచవచ్చు.
ఈ పాలసీని ఆన్ లైన్లో ఎల్ఐసీ వెబ్ సైట్ ద్వారా లేదా దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
నామినీకి చెల్లింపు
PMVVY నిర్దేశించిన వడ్డీ రేటు ప్రకారం పదేళ్ల పాటు ఖచ్చితమైన పెన్షన్ను అందిస్తుంది. ఈ పథకం డెత్ బెనిఫిట్ను ఆఫర్ చేస్తుంది. పాలసీ కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారు జీవించి ఉంటే పాలసీ కొనుగోలు చేసిన పదేళ్లకు ఎంత ప్రీమియంకు అయితే కొన్నామో ఆ మొత్తం చెల్లిస్తారు. దీంతో పాటు పెన్షన్ చివరి వాయిదాను పొందుతారు. పాలసీదారుకు/పెన్షన్దారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా వారసులకు అందిస్తారు.
ఇలా జమ
ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీలో చేరాలి. కనీసం రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షలతో కొనుగోలు చేయాలి. చెక్, డీడీ, బ్యాంకర్స్ చెక్కు ద్వారా చెల్లించాలి. నెల నెలా చెల్లిస్తారు. నెల నెల వద్దనుకుంటే మూడు నెలలకు, ఆరు నెలలకు లేదా ఏడాదికి చెల్లిస్తారు. ఈసీఎస్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.