సంక్షోభం తర్వాత..: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, కాస్త ప్రశాంతంగా ఉండండి!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్తో కూడుకున్నది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో పాటు కరోనా వంటి అనుకొని ఉపద్రవాలు, ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పాతాళానికి పడిపోయే సందర్భాలు, అలాగే హఠాత్తుగా ఎగిసిపడే పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు గత ఏడాది(2020)లో కరోనా కారణంగా మార్చి నెలలో ఘోరంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 26000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ 7000 దిగువకు పడిపోయాయి. దీంతో అప్పుడు ఇన్వెస్టర్ల సంపద భారీగా కరిగిపోయింది.
కరోనా కేసులు తగ్గుతున్నాకొద్దీ మార్కెట్లు మెల్లిగా పుంజుకున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో మళ్లీ పడిపోయినప్పటికీ, కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ కారణంగా మార్కెట్ కుదురుకుంది. గత కొద్ది నెలలుగా సెన్సెక్స్ పరుగులు పెడుతోంది. ఇటీవల ఆల్ టైమ్ గరిష్టం 62,000 మార్కును క్రాస్ చేసింది. అయితే గత నెలలో సెన్సెక్స్ మళ్ళీ పడిపోయింది. మార్కెట్ రిస్క్తో కూడుకున్నది కాబట్టి అన్నింటిని పరిశీలించి, స్టాక్స్ పైన అవగాహన పెంచుకొని, నిపుణుల సలహాతో పెట్టుబడి మంచిది. స్టాక్ మార్కెట్లో ఎమోషన్ వంటివి ఉండకూడదు. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే సమయంలో ఇవి అవసరం...
అప్ అండ్ డౌన్ పట్ల స్థిరంగా
స్టాక్ మార్కెట్లో చాలాకాలంగా పెట్టుబడి పెట్టేవారికి మార్కెట్ అప్ అండ్ డౌన్ తెలిసి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి కాస్త ధైర్యం, చురుకుదనం, అప్రమత్తత అవసరం. ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ డైరెక్షన్స్ ఏ దిశలో ఉన్నప్పటికీ మనం అన్నింటికి సిద్ధపడి ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఉద్వేగానికి గురికాకుండా, స్థితిస్థాపకంగా ఉండేందుకు అలవాటు చేసుకోవాలి. అయితే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఈజీగా ఉండటం కాస్త కష్టమైన పని. అందుకే ఇన్వెస్ట్ చేసే సమయంలో ఒకేదాంట్లో కాకుండా భిన్న రంగాలు, భిన్నమైన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు నష్టం తక్కువగా ఉంటుంది.
అలాగే, హఠాత్తుగా వచ్చే మార్కెట్ పరుగును సాధ్యమైనంత వరకు సొమ్మును చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులోను పరిస్థితులను గమనించి ఏ రంగం.. ఏ స్టాక్ నుండి ఉపసంహరించుకోవాలి, ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అట్టిపెట్టుకోవాలో అవగాహన చేసుకోవాలి.
సొంత బిజినెస్లా
ఇన్వెస్టర్లు తమకు తాము స్వయం ఉపాధి పొందిన వ్యవస్థాపకులుగా పరిగణించాలి. వ్యాపారాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఆవేశంలో, ఎమోషన్తో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు పెట్టుబడిని ఒక అభిరుచిగా మాత్రమే పరిగణించినట్లయితే మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే వ్యాపార ప్రణాళికను రూపొందించుకోవాలి.
మీ టార్గెట్ జాబితాను సిద్ధం చేసుకోవాలి. మీ రిస్క్ ప్రొఫైల్ను, మీ పెట్టుబడి మొత్తం, ప్లాన్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మీరు పెట్టుబడి పెట్టే మూలధనం ఎంత, అందులో ఎంత కోల్పోయినా మీరు తట్టుకోగలరు అనే అంశాలపై కచ్చితంగా ఉండాలి. పక్కా వ్యాపార కోణంలో ముందుకు సాగాలి.
ఆ టైంలో కొనాలన్నా.. విక్రయించాలంటే
డిప్ సమయంలో కొనుగోలు చేయాలన్నా, భారీగా ఎగిసిన సమయంలో విక్రయించాలన్నా... కాస్త ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ సమయంలో ఒత్తిడిలో ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా ఆ స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో స్టడీ చేసి, అవగాహన పెంచుకొని తదుపరి నిర్ణయం తీసుకోవాలి. స్టాక్ డిప్ కొనుగోలు లేదా లాభపడిన సమయంలో విక్రయించాలన్నా సమయం తీసుకోవడం సముచిత నిర్ణయంగా చెప్పవచ్చు. సాధారణంగా మార్కెట్లో ప్రారంభ పెట్టుబడిదారు భావోద్వేగాలకు లోనవుతాడు.
అనుభవజ్ఞులు చాలా తక్కువగా భావోద్వేగానికి గురవుతారు. ఇంకా చెప్పాలంటే నిర్దిష్ట మార్కెట్ సమయంలో ఏం చేయాలో తెలియక భావోద్వేగానికి లోనవుతారు. దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్ అస్థిరతను ప్రేరేపించే కారణాలను అన్వేషించాలి. మార్కెట్ వార్తలకు సంబంధించినవి చదవడం, వింటూ ఉండటం చేయాలి.
సంక్షోభం తర్వాత కోలుకోవడం
మార్కెట్లో భారీ కుదుపులు వస్తే ఇదే మొదటిది కాదని, ఇదే చివరిది కాబోదని గుర్తుంచుకోవాలి. అలాగే, ప్రతి సంక్షోభం తర్వాత మార్కెట్ పుంజుకోవడం కచ్చితంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. భారత, ప్రపంచ మార్కెట్లు సంక్షోభం నుండి కోలుకొని ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. గత అనుభవాలతో పాటు ఇటీవలి కరోనా సమయంలోను ఈ పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తోంది. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ సమయంలో మీరు చేసిన తప్పు ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నిపుణుల సలహాల తీసుకోవాలి. మార్కెట్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.