పెరిగిన క్లెయిమ్స్, ఆరోగ్య బీమా ప్రీమియం మరింత భారం: ఈ కంపెనీ 25% పెంపు
ఇన్సురెన్స్ ప్రీమియం పైన కరోనా మహమ్మారి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా సంబంధిత సమస్యలు బాగా పెరగడంతో పాటు దీనిని అదుపు చేసే పరిస్థితుల్లో ఇబ్బందికర పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య బీమా సంస్థలు వార్షిక ప్రీమియంను కొంత పెంచవచ్చునని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సురెన్స్ సంస్థ టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ ప్రీమియంను 25 శాతం పెంచింది. ఏప్రిల్ నుండి దీనిని పెంచుతున్నట్లు ప్రకటించింది. గత ఏడాది ఈ బీమా కంపెనీ క్లెయిమ్స్ 30 శాతం పెరిగాయి.
ఎవరికి ఎంత పెరుగుతుందంటే
రూ.1 కోటి కవరేజీ టర్మ్ ప్లాన్కు 14 శాతం నుండి 25 శాతం పెంచనుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఇదివరకు రూ.1 కోటి కవరేజీ టర్మ్ ప్లాన్ పైన రూ.7000 యాన్యువల్ ప్రీమియం చెల్లిస్తే, ఇప్పుడు రూ.8600 చెల్లించాలి. ఏప్రిల్ 21 నుండి ఇది వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. రూ.1 కోటి లైఫ్ ఆప్షన్, యాన్యువల్ ప్రీమియం పైన (జీఎస్టీ కాకుండా, నాన్-స్మోకింగ్ మేల్) 20 ఏళ్ల వ్యక్తి పాలసీ టర్మ్ 40 ఏళ్లయితే 14 శాతం పెరగవచ్చు. 25 ఏళ్ళ వ్యక్తికి 20 శాతం, 30 ఏళ్ల వ్యక్తికి 23 శాతం, 35 ఏళ్ల వ్యక్తికి 25 శాతం, 40 ఏళ్ల వ్యక్తికి 25 శాతం ఉంటుంది. 45 ఏళ్ల వ్యక్తికి 35 ఏళ్ల పాలసీ టర్మ్కు 22 శాతం, 50 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల పాలసీ టర్మ్కు 18 శాతం, 55 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల పాలసీ టర్మ్కు 16 శాతం పెరుగుతుంది.
ఇదివరకు, ఇప్పుడు...
20 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.4,400 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.5000 చెల్లించాలి.
25 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.5,400 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.6500 చెల్లించాలి.
30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.7,000 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.8600 చెల్లించాలి.
35 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.9,900 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.12400 చెల్లించాలి.
40 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.15,100 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.18800 చెల్లించాలి.
45 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.20,700 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.25300 చెల్లించాలి.
50 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.28,300 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.33500 చెల్లించాలి.
55 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల పాలసీ టర్మ్కు ఇదివరకు రూ.37,400 చెల్లిస్తుండగా, ఇప్పుడు రూ.43300 చెల్లించాలి.
ఇతర సంస్థలు అదే దారిలో
దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇతర వ్యాధులు, అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కన్నా కోవిడ్ బాధితులే అధికంగా ఉంటున్నారు. చికిత్స ఖర్చు రూ.లక్షల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలను అందించే సాధారణ బీమా, ఆరోగ్య బీమా సంస్థలపై క్లెయిమ్స్ ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ప్రీమియం పెంచడంపై సంస్థలు దృష్టి సారించాయి. ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు ఈ దిశగా అడుగులు వేశాయి. మరికొన్ని త్వరలో పెంచేందుకు నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు 15 శాతం నుండి 35 శాతం పెంచవచ్చు.