ఆర్బీఐ ఎఫెక్ట్, ఈఎంఐ భారంగా మారుతుందా.. అయితే ఇలా చేయండి!
దేశీయంగా సానుకూలతలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా వంట నూనె నుండి గోధుమ కొరత వరకు ధరలు ప్రభావం చూపాయి. పాలు, పాల పదార్థాలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలు పెరిగాయి. అన్ని ఉత్పత్తులపై ప్రభావం చూపే చమురు ధరలు 100 డాలర్లకు పైనే ఉన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా మన దేశంలో ద్రవ్యోల్భణం ఆకాశాన్నంటుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. కంపెనీల మార్జిన్లు తగ్గితే మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ద్రవ్యోల్భణం పెరిగితే సేవింగ్స్, పెట్టుబడులు, పోటీ, వృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అత్యవసరంగా ఎంపీసీ సమావేశం ఏర్పాటు చేసి, రెపో రేటు పెంపుపై నిర్ణయం తీసుకున్నది.
ఈఎంఐ భారం, రుణం తగ్గుదల
ఆర్బీఐ వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో రుణగ్రహీతలకు ఈఎంఐ కాస్త భారమవుతుంది. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. రెండేళ్లుగా రెపో రేటును దశాబ్దాల కనిష్టం 4 శాతం వద్ద కొనసాగించింది ఆర్బీఐ. ఇప్పుడు 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి చేర్చింది. 2018 ఆగస్ట్ తర్వాత కీలక వడ్డీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. నగదు నిల్వల నిష్పత్తిని కూడా 50 బేసిస్ పాయింట్ల మేర పెంచి 4.5 శాతానికి చేర్చింది ఆర్బీఐ. రెపో రేటు పెరగడం వల్ల హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతర రుణాలు తీసుకునే వారిపై ఈఎంఐ భారం పెరుగుతుంది. సీఆర్ఆర్ పెరగడ వల్ల ఆర్బీఐ వద్ద బ్యాంకులు మరిన్ని నిధులను నిల్వ ఉంచవలసి ఉంటుంది. రూ.87,000 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థ నుండి వెళ్తాయి. ఈ మేరకు వినియోగదారులు, వ్యాపారులకు, ఎంఎస్ఎంఈలకు రుణాలు తగ్గుతాయి. అప్పుడు బ్యాంకుల రుణ వృద్ధి తగ్గుతుంది. డిపాజిట్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, డిపాజిటర్లకు ప్రయోజనం.
మరింత పెంపు
వాస్తవానికి వచ్చే నెల 6-8 తేదీల మధ్య ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఉంది. అప్పుడు రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని అంచనా వేశారు. అయితే ఆర్థిక వ్యవస్థ సాధారణ పరిస్థితికి వచ్చేసరికి సరఫరా కంటే డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా మారింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల కమోడిటీ, మెటల్, ఎరువుల ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం అనంతరం ఇంధన, ఆహార ధరలు మరింత పెరగడంతో మూడు నెలలకుగా ఆర్బీఐ 2-4 కంటే ఎక్కువగా నమోదవుతోంది ద్రవ్యోల్భణం. మార్చిలో 17 నెలల గరిష్టం 6.95 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అత్యవసరంగా సమావేశమై రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఇక రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నారు. స్డాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 4.5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.65 శాతం వద్ద ఉండనున్నాయి. ఏప్రిల్ నెలలో వెలువరిచిన జీడీపీ అంచనాలను కూడా ఆర్బీఐ స్థిరంగా కొనసాగించింది.
వచ్చే ఎంపీసీ సమావేశంలోను రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బేసిస్ పాయింట్లు లేదా అంతకంటే కాస్త ఎక్కువ పెంచవచ్చునని భావిస్తున్నారు.
భారమే.. కానీ ప్రత్యామ్నాయం
హోమ్ లోన్ వడ్డీ రేట్ల పెరుగుదలతో రుణ గ్రహీతలు ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి లోన్ కాల వ్యవధిని పెంచుకోవచ్చు. లేదా నలెవారీ వాయిదాను తగ్గించుకోవడానికి వారి రుణం పైన పాక్షిక ముందస్తు చెల్లింపులు చేయవచ్చు. ఈఎంఐకి బదులు లోన్ కాల వ్యవధిని సవరించడం సాధారణ పద్ధతి అని, అయితే హోమ్ లోన్ వంటి వాటిని ముందస్తు చెల్లింపు పద్ధతి ద్వారా భారం తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు.
ఎంత పెరుగుదల?
ఉదాహరణకు ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు ఇప్పటి వరకు 6.85 శాతంగా ఉంది. ఆర్బీఐ రెపో రేటు పెంపు అనంతరం ఇది 7.25 శాతానికి చేరుకుంటుంది.
ఒకవేళ రూ.30 లక్షల రుణం తీసుకుంటే పాత వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ రూ.22,990 అవుతంది. కొత్త వడ్డీ రేటు ప్రకారం రూ.23,711కు పెరుగుతుంది. పాత వడ్డీ ప్రకారం ఇరవై ఏళ్లలో వడ్డీగా రూ.25,17,510 చెల్లించవలసి వస్తుంది. కొత్త వడ్డీ ప్రకారం రూ.26,90,707 చెల్లించవలసి వస్తుంది. అదనంగా రూ.721 ఈఎంఐ అవుతుంది. అయితే బ్యాంకులను బట్టి ఇది మారుతుంది.