మీ బంగారంపై హాల్ మార్క్ సరైందేనా? ఒక్కసారి చెక్ చేసుకోండి...
మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా? దానిపై హాల్ మార్కింగ్ ఉంది కదా అని ధీమాగా ఉన్నారా అయితే ఒక్కసారి దాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే బంగారు ఆభరణాలకు నకిలీ హాల్ మార్కింగ్ కూడా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి మీరు కొన్న ఆభరణం నాణ్యత ఎంత ఉన్నదో చూసుకోండి. మీకు ఆభరణాల విక్రయదారు చెప్పినట్టుగానే నాణ్యత ఉన్నాదోలేదో చూసుకోవడం మీ భాద్యతే కదా లేకపోతే జరిగే నష్టం మీకే కదా.
బంగారాన్ని చూసి దాని నాణ్యతను చెప్పడం చాలా కష్టం. కాబట్టి దాని నాణ్యతను నిర్ధారించే అస్సేయింగ్, హాల్ మార్కింగ్ కేంద్రాలు ఉంటాయి. ఇవి ఆభరణానికి సంభందించిన నాణ్యత సర్టిఫికెట్ ను ఇస్తాయి. ఇదే మనకు భరోసాను ఇస్తుంది. అయితే హాల్ మార్కింగ్ ను కూడా కొంత మంది మోసపూరితంగా చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగించేవే. కొంత మంది జువెలర్లు హాల్ మార్కింగ్ మెషిన్ ను కొనుగోలు చేసి కూడా హాల్ మార్కింగ్ గుర్తును వేసే అవకాశం ఉండవచ్చని ఈ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు తీసుకున్న ఆభరణం నాణ్యత సరయినదా కాదా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటే...
ఇలా చేయండి..
* నగరాల్లో ఉండే పెద్ద దుకాణాల్లో బంగారం నాణ్యతను తెలియజేసే యంత్రాలు అందుబాటులో ఉంటాయి. అక్కడ మీరు తీసుకున్న ఆభరణ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు తమ పాత కస్టమర్లకు ఉచితంగా ఈ సదుపాయాన్ని కల్పిస్తాయి. మరికొన్ని మాత్రం కొత్త చార్జీని వసూలు చేయవచ్చు.
* బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్ మార్కింగ్ కేంద్రాల్లో కూడా ఆభరణం నాణ్యతను పరీక్షించుకోవచ్చు. ఇందుకు కొంత చార్జీని వసూలు చేస్తారు. పరీక్ష తర్వాత తగిన సర్టిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ నాణ్యతలో తేడా ఉంటే తొలుత సర్టిఫికేషన్ ఇచ్చిన కేంద్రం వినియోగదారుని నుంచి వసూలు చేసిన చార్జీని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
* మీకు జువెలర్ చెప్పిన ప్యూరిటీ, మీరు తెలుసుకున్న ప్యూరిటీలో తేడా ఉంటె మీరు జువెలర్ వద్దకు వెళ్లి తగిన పరిహారాన్ని పొందే అవకాశం ఉంటుంది.
* బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో చెల్లించాలి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద దుకాణంలో కొనుగోలు చేసినప్పుడు మోసాలకు తావు ఉండక పోవచ్చు కానీ చిన్న దుకాణాల్లో అవకాశాలు ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
2021 జనవరి నుంచి తప్పనిసరి
బంగారు ఆభరణాలకు 2021 జనవరి 15 నుంచి హాల్ మార్కింగ్ తప్పనిసరికానుంది. ఇందుకు సంభందించి వచ్చే ఏడాది జనవరి 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలకు దాని అమలుకు మధ్య ఏడాది గడువు ఉంటుందన్నమాట. ఏడాది తర్వాతి నుంచి అన్ని బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ తప్పని సరి కానుంది. అప్పటి వరకు దేశంలోని జువెలర్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టార్డర్స్ (బీఐఎస్) వద్ద రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హాల్ మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. బంగారానికి హాల్ మార్కింగ్ అనేది దాని ప్యూరిటీకి సంబంధించిన సెర్టిఫికేషన్ అన్నమాట. ప్రస్తుతం ఇది స్వచ్చందంగా అమలవుతోంది. 2000 సంవత్సరం నుంచే హాల్ మార్కింగ్ పథకం అమల్లో ఉంది. ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న ఆభరణాలలో కేవలం 40 శాతం మాత్రమే హాల్ మార్కింగ్ తో అమ్ముడవుతున్నట్టు అంచనా.
వినియోగదారులకు లాభం
వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు హాల్ మార్కింగ్ ను తప్పని సరి చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ ఉండటం లేదు. దీని వల్ల ఆ ఆభరణం ఎంత నాణ్యతతో ఉన్నదో తెలుసుకునే అవకాశం ఉండటం లేదు. దీని వల్ల బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు నష్టం జరుగుతున్నట్టు చెబుతున్నారు.
మూడు గ్రేడ్స్
బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ సంబంధించి బీఐఎస్ మూడు గ్రేడ్స్ ను అమలు చేస్తోంది. అవి.. 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 234 జిల్లాల్లో 877 అసేయింగ్, హాల్ మార్కింగ్ కేంద్రాలున్నాయి. 26,019 మంది జువెలర్లు బీఐ ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.