త్వరలో బంగారం పాలసీ రాబోతోంది: దీన్ని తీసుకురావడానికి కారణాలివే...
భారత దేశంలో బంగారం వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు అనుకుంట. ప్రతి మహిళ మెడలోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. పండగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళలాడిపోతాయి. ధరలు పెరిగే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తే ఎగబడి కొనుగోళ్లు చేస్తారు. తగ్గవచ్చునంటే ఇంకా తగ్గుతాయేమోనని వేచిచూస్తారు. తమ వద్ద ఉన్న సొమ్మును పొదుపు చేయాలని భావిస్తే ముందు బంగారం గురించే ఆలోచిస్తారు చాలా మంది. ఈ డిమాండ్ కారణంగానే బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
మన దేశంలో బంగారం ఉత్పత్తి తక్కువ. డిమాండ్ మాత్రం ఎక్కువ. అందుకే విదేశాల నుంచి ఏడాదికి దాదాపు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల కరెంట్ ఖాతా లోటు పెరుగుతోంది. దీన్ని చూసే ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. అయినప్పటికీ పెద్దగా మార్పు రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు పెరిగిన ఫలితంగా డిమాండ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది.
ఈ కొత్త ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారా?
విధానం రాబోతోంది..
* మన దేశ బులియన్ మార్కెట్ ప్రపంచ డిమాండ్ ను ప్రభావితం చేస్తోంది. మన దేశంలో తయారయిన బంగారు ఆభరణాలు ఇతర దేశాలు ఎగుమతి అవుతున్నాయి. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగారం విధాన ప్రాధాన్యత ఏర్పడింది.
* బంగారం విధానం పై నీతి ఆయోగ్ సవివరణ నివేదికను సమర్పించిందని, దీన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక వ్యవహారాల శాఖా జాయింట్ సెక్రటరీ సురిందర్ పాల్ సింగ్ తెలిపారు.
* త్వరలోనే దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు.
* బంగారం పరిశ్రమతో పాటు ఆభరణాల ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది.
* బంగారం వినియోగంలో భారత్ అతిపెద్ద దేశంగా ఉంది. దిగుమతులు కూడా భారీగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పటి బంగారానికి సంబంధించి ఒక విధానం లేదు.
పరిశ్రమ వర్గాలు ఏమంటున్నాయంటే...
* ప్రభుత్వం సమగ్ర బంగారం విధానాన్ని తీసుకువస్తే బంగారం బలమైన ఆర్థిక ఆస్తిగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
* కొత్త విధానంలో భాగంగా బ్యాంకులను బులియన్ బ్యాంకింగ్ కు అనుమతిచ్చే అవకాశం ఉందంటున్నారు.
* స్పాట్ ఎక్స్చేంజి లు కూడా రావడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.
* వీటి వల్ల మరింత పారదర్శకత పెరగడానికి అవకాశం ఏర్పడుతుందటున్నారు.
* వినియోగదారులు, చిన్న జువెలర్స్ కు ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చంటున్నారు.
ఎగుమతులకు బాసట
* బంగారం విధానం ద్వారా ఆభరణాల ఎగుమతులకు సానుకూలంగా వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. ఈ రంగం వృద్ధి చెందితే మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది.