రూ.48,000కు దిగువనే బంగారం ధరలు, రూ.62,000 దిశగా వెండి ధర
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో(MCX)లో రూ.48,000కు దిగువనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగి 1825 డాలర్లకు చేరుకున్నాయి. కామెక్స్లో బంగారం ధరలు ఏడు రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. వరుసగా నాలుగు రోజులుగా ఈ ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్భణం నలభై ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్, డీఎక్స్వై ఒత్తిడిలో ఉన్నాయి. ఈ ప్రభావం పసిడిపై ఉంటుంది.
గోల్డ్ ఫ్యూచర్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.5 క్షీణించి రూ.47,803 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51 తగ్గి రూ.47,862 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 1827.30 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో పసిడి 2.02 శాతం క్షీణించింది. పసిడి 52 వారాల కనిష్టం 1680 డాలర్లు, గరిష్టం 1922.80 డాలర్లు. నేటి సెషన్లో 1823 డాలర్ల నుండి 1826 డాలర్ల మధ్య కదలాడింది.పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8400 తక్కువగా ఉంది.
వెండి ధరలు పెరిగాయి
వెండి ధరలు కూడా పెరిగాయి. 61,000 స్థాయిలో ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.62000 సమీపానికి వచ్చాయి. నిన్న దాదాపు రూ.800 పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో రూ.34 పెరిగి రూ.61,890 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.69 ఎగిసి రూ.65,545 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో ఏకంగా 23 డాలర్ల పైకి చేరుకుంది. నిన్నటి సెషన్లో 23.207 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో దాదాపు పది శాతం క్షీణించింది.
మద్దతు.. నిరోధకం
డిసెంబర్తో ముగిసిన ఏడాదిలో యూఎస్ సీపీఐ ద్రవ్యోల్భణం భారీగా పెరిగింది. 1982 తర్వాత 7 శాతానికి చేరుకుంది. ఇది బంగారంపై ప్రభావం చూపింది. రెండు రోజులుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు 1800 డాలర్లకు పైనే ఉండే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిరోధకస్థాయి 1830 డాలర్లు. ఈ స్థాయి దాటితే 1870 వరకు వెళ్లవచ్చునని చెబుతున్నారు. మద్దతు ధర 1780 డాలర్లు. ఈ దిగువకు పడిపోతే 1720 డాలర్లకు రావొచ్చునని అంటున్నారు.