బంగారం ధరలు రూ.40,000 దిగువకు వస్తాయా, రూ.42వేల వద్ద కొనుగోలు?
గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.12,000కు పైగా తక్కువగా ఉంది. కేవలం 2021 ఏడాదిలోనే పసిడి ధరలు రూ.5000కు పైగా క్షీణించాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్, వేగవంతమైన రికవరీ నేపథ్యంలో పసిడి ధరలు అంతకంతకూ పడిపోయాయి. గత నెలలో ఏకంగా 45వేల దిగువకు, చివరలో 44వేల దిగువన కూడా ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో చాన్నాళ్లకు 1700 డాలర్ల దిగువకు వచ్చాయి. ఆల్ టైమ్ గరిష్టం 2072 డాలర్లతో దాదాపు 400 డాలర్లు కూడా తగ్గిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మరింత తగ్గుతాయా అనే ప్రశ్న చాలామందిలో ఉంది.
బంగారంపై ఒత్తిడి
ఈక్విటీ మార్కెట్ల తీవ్ర ఒడిదుడుకులు, క్షీణిస్తున్న రిటర్న్స్ వంటి వివిధ అంశాలు బంగారం పెరగడానికి దోహదపడతాయి. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అందుకే మార్కెట్ ఒడిదుడుకులు, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పసిడిపై పెట్టుబడులు పెడతారు. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టంతో 20 శాతం తక్కువగా ట్రేడ్ అవుతోంది. అయితే ఇటీవల బాండ్ యీల్డ్స్ పెరగడం, డాలర్ బలపడటం పసిడిపై ఒత్తిడి పెంచింది. దీంతో పసిడి ధరలు ఇటీవల అంతకంతకూ క్షీణిస్తున్నాయి.
రూ.40వేల దిగువకు వస్తుందా అంటే
ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ప్రస్తుతం 45,500 వద్ద ఉంది. ఆగస్ట్ 2020న ఇది 56,200 వద్ద ట్రేడ్ అయింది. కరోనా కేసులు తగ్గడం, రికవరీ వేగవంతమైతే పసిడిపై మరింత ఒత్తిడి తగ్గి ధరలు తగ్గవచ్చునని, అదే సమయంలో బంగారానికి ధీటుగా బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ వైపు ఇన్వెస్టర్లు చూస్తుండటంతో రూ.40వేల స్థాయికి పతనమైనా అశ్చర్యం లేదని అంటున్నారు. అయితే ఇది కాస్త క్లిష్టమైనదే అంటున్నారు. వరస్ట్ పరిస్థితుల్లో ఈ స్థాయికి మాత్రం పడిపోదని చెప్పలేమంటున్నారు.
42,000 స్థాయికి...
ప్రస్తుతం బంగారం ధరలు భారీగా క్షీణించాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయని, మరింత పెరగవచ్చునని, అలాగే డాలర్ ఇండెక్స్ పెరుగుతోందని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రూ.42,000 స్థాయికి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ లెవల్లో కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు. అయితే వరస్ట్ పరిస్థితుల్లోనే రూ.40వేల దిగువకు వస్తుందంటున్నారు.