అమ్మో! మళ్లీ ఈ పొరపాటు చేయొద్దు! కరోనా నేర్పిన కొన్ని 'మనీ' సూత్రాలు
కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు లేక వ్యాపారస్తులు, ఉద్యోగాలు పోయి లేదా ఉద్యోగాల కోత కారణంగా ఉద్యోగులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో మినహా ఇప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లడానికి కూడా దాదాపు అవకాశం లేదు. మనీ మేనేజ్మెంట్ గురించి ఆర్థిక నిపుణులు చాలా సూచనలు చేస్తుంటారు. కానీ వాటిని పాటించే వారు చాలా తక్కువమంది. అయితే ఇప్పుడు కరోనా-లాక్డౌన్ నేపథ్యంలో.. అమ్మో వారు చెప్పినవి వాస్తవమే.. మనీ మేనేజ్మెంట్ తప్పకుండా ఉండాలని, ఇక నుండి అయినా దానిని అనుసరిద్దామని కొంతమంది అయినా భావిస్తూ ఉంటారు. చేతిలో డబ్బులుంటే ప్లాన్ లేకుండా ఖర్చు చేయడం, క్రెడిట్ కార్డు ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేకపోయినా షాపింగ్.. ఇలా ఎన్నో అనవసర ఖర్చులు చేస్తుంటారు. డబ్బు విషయంలో చాలామంది పొరపాటు చేస్తారు. అలా చేసే కొన్ని పొరపాట్లు తెలుసుకుందాం.
రూ.95,000 లిక్కర్ కొనుగోలు చేసిన కస్టమర్, 10 గంటల్లో రూ.45 కోట్లు
ఆదాయానికి మించి ఖర్చు.. కరోనా గుణపాఠం
వ్యాపారం ద్వారా లేదా శాలరీ రూపంలో తమకు వచ్చే వేతనం కంటే ఎంతోమంది ప్రతి నెల ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కొంతమంది ఆర్భాటాలకు పోయి ఖర్చులు చేస్తారు. మరికొంతమంది అవసరమున్నా లేకపోయినా అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తారు. ఇలాంటివి మానుకోవడం మంచింది. అత్యంత అవసరమైతే తప్పు అప్పు చేసి జీవించడం మంచిది కాదు. మనకు వచ్చే వేతనంలో కొంత మొత్తాన్ని ఖర్చుల కోసం, మరి కొంత మొత్తం భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడం మంచిది. చాలామంది ఆదా చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితులు డబ్బు ఆదా చేయడం ఎంత అవసరమో చెప్పకనే చెప్పింది.
సాధ్యమైతేనే ఇవి చేయాలి
హోమ్ లోన్ వంటి నెవర్ ఎండింగ్ పేమెంట్స్ కొన్నింటిని మన తాహతుకు మించి పెట్టుకోవద్దు. ఉద్యోగం ఎంత వరకు సురక్షితం, మన ఆదాయం ఏ మేరకు వస్తోంది, లోన్ ఉన్నంత కాలం ధీమాగా ఉండగలమా అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితులు ఓ వైపు కుటుంబ పోషణను ఇబ్బందులకు గురి చేయగా, ప్లాన్ లేకుండా చేసే ఇలాంటి నెవర్ ఎండింగ్ పేమెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెడుతాయి. అయితే మనకు సాధ్యం అవుతుందా అని అంచనా వేసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ఇల్లు, కారు వంటి వాటికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం. ఇవి కొనుగోలు చేసే సమయంలో ఆషామాషీగా ఉండవద్దు. అవసరమైతే తప్పు అప్పు చేసి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఏమాత్రం మంచిది కాదు.
బడ్జెట్ ప్లాన్
ప్రతి వ్యక్తికి బడ్జెట్ ప్లాన్ అవసరం. దాదాపు రెండు నెలల కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో బడ్జెట్ ప్లాన్ ఎంతగా అవసరమనేది చాలామందికి తెలిసి వచ్చి ఉంటుంది. మన ఆదాయం, ఖర్చులు ఆధారంగా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి.
మీ ఖర్చుల ఆధారంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. మీ వేతనంలో ఇంటి కిరాయి, మీ వాహనం పెట్రోల్ ఖర్చు, ఈఎంఐలు, నెలసరి వస్తువుల కోసం ఖర్చులు.. ఇలా అన్ని ఖర్చుల కోసం 50 శాతం ఉండాలి. మిగతా 50 శాతంలో 30 శాతం వరకు సేవింగ్స్, మరో 20 శాతంలో ఎమర్జెన్సీ ఫండ్, ఇతరాలు ఉండటం మంచిది. ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరిగా ఉండాలి.
ఒకే దగ్గర స్టక్ కావొద్దు
ఓ కంపెనీలో ఎక్కువ కాలం పని చేశాక ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశాబ్దాలుగా అదే కంపెనీలో ఉంటే మీ వేతనం అంతకంతకూ పెరుగుతుంది. అప్పుడు కంపెనీ మీ బదులు నలుగురు ఫ్రెషర్స్ కోసం ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఒకే దగ్గర స్టక్ కాకుండా ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలి.
రెండో వేతనం ఉండాలి
ప్రతి వ్యక్తి తనకు ఉన్న వ్యాపారం, ఉద్యోగంతో పాటు రెండో వేతనం వచ్చేలా చూసుకోవాలి. అది ఏ మార్గంలో అయినా ఉండవచ్చు. ఒకే వేతనంపై ఆధారపడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మనకు సాధ్యమైతే మ్యూచువల్ ఫండ్స్, ప్లాట్స్, ఈక్విటీ, బంగారం వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయితే ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి.