ఈక్విటీ ఫండ్ల పెట్టుబడి మార్గం సూచించేందుకు 5 ముఖ్య కారణాలు
రిస్క్ ఉంటేనే కదా ఉత్తమ రాబడి వచ్చేది. ఆ విధంగా ఈ సమయంలో ఈక్విటీ ఫండ్లను సూచించేందుకు గల 5 ముఖ్య కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మంది పెట్టుబడులు, పొదుపు అనగానే ఫిక్స్డ్ డిపాజిట్ల గురించే ఆలోచిస్తారు. మార్కెట్లో ఇంకా చాలా పెట్టుబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడినే ఇస్తాయి. మళ్లీ ఎక్కువ రాబడి అనగానే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు రిస్క్ అంటారు. అందుకే స్టాక్ మార్కెట్ తరహా రాబడులనిస్తూ తక్కువ రిస్క్ ఉండేందుకు మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. అయితే వీటికి సైతం మార్కెట్ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంటేనే కదా ఉత్తమ రాబడి వచ్చేది. ఆ విధంగా ఈ సమయంలో ఈక్విటీ ఫండ్లను సూచించేందుకు గల 5 ముఖ్య కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. నష్టభయానికి సరైన అర్థం
నష్టభయం(రిస్క్)... ఈ మాటను మదుపరులు ఒక్కోసారి పొరపాటుగా అర్థం చేసుకుంటారు. నష్టభయం అనేది పెట్టుబడుల కాలవ్యవధి, వ్యక్తి వయసు, పెట్టుబడులపై వారు నష్టాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. స్వల్పకాల వ్యవధికి పెట్టుబడులపై హెచ్చుతగ్గులపై వాటి నష్టభయం ఆధారపడి ఉంటుంది. నిర్ణీత సమయంలో పెట్టుబడి విలువ ఎంత పెరిగిందీ, ఎంత తగ్గింది అనేదాన్ని బట్టి నష్టభయం ఉంటుంది. దీర్ఘకాల దృష్టిలో ఆలోచిస్తే మనం ఇప్పుడు చేసే పెట్టుబడులతో భవిష్యత్లో కొనుగోలు శక్తిని నిలుపుకోగలమా లేదా అనేదాన్ని ప్రధానంగా చూసుకోవాలి.
2. బ్యాంకులో సొమ్ము విలువ తరిగిపోతోంది!
ద్రవ్యోల్బణాన్ని తలదన్ని సంపదను సృష్టించుకునేందుకు కేవలం పొదుపు చేస్తే సరిపోదు.. పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిర్ణీత రాబడులతో పాటు సురక్షితమైనవి కాబట్టి చాలా మంది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆసక్తి చూపిస్తారు. అయితే వీటిపై రాబడి ఈ మధ్యకాలంలో కేవలం 6.8శాతంగానే ఉంది. 30శాతం ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవారికి నికర రాబడి కేవలం 4.6శాతమే వస్తుంది. జనవరి 2014 నుంచి సరాసరి ద్రవ్యోల్బణం 5శాతంగా ఉంది. వాస్తవానికి బ్యాంకులో మీరు వేసే సొమ్ము విలువ తరిగిపోతుంది. సురక్షితమైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం మూలాన అసలు లాభాన్ని కోల్పోయే ప్రమాదముంది.
3. ఈక్విటీ మార్గాన్ని ఎంచుకోండి
సంపద సృష్టించుకునేందుకు ఈక్విటీ మార్గాన్ని ఎంచుకోవడం మేలు. స్వల్పకాలంలో పెట్టిన పెట్టుబడి కోల్పోయే ప్రమాదమున్నా పెట్టుబడుల్లో వైవిధ్యతను(డైవర్సిఫికేషన్) చూపించి దీర్ఘకాలంలో నష్టభయాన్ని తగ్గించుకోవచ్చు.
దీర్ఘకాల పెట్టుబడులపై పన్ను ఉండదు. స్వల్పకాల లాభాలపై మాత్రం 15శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అది మీరు ఏ ట్యాక్స్ శ్లాబ్ కిందికి వస్తారో అన్నదానికి సంబంధం లేదు. ఈక్విటీల్లో పెట్టే సొమ్ము ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) ఎక్కువ. కావాల్సినప్పుడు సొమ్ము విత్డ్రా చేసుకోవచ్చు.
బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభమైనప్పటి నుంచి 16.3శాతం పెరిగింది. ఇక చాలా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు గడచిన 20ఏళ్లలో దాదాపు 20శాతం రాబడినందించాయి.
4. ఇప్పుడే ఎందుకంటే..
భారత స్టాక్మార్కెట్లు మంచి వృద్ధిలో ఉన్నాయి. అందుకే పెట్టుబడికి ఇదే సరైన సమయమని నిపుణులంటారు. బ్యాంక్ డిపాజిట్లు, బంగారు, స్థిరాస్తి లాంటి వాటిపై పెట్టుబడుల నుంచి ఇప్పుడిప్పుడే జనాలు మ్యూచువల్ ఫండ్లు, షేర్లకు మళ్లుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అధిక సంఖ్యలో సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చి చేరాయి. దీంతో తమ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఇలా ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్లకు మళ్లించారు.
5. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి వేళయ్యింది
గత సంవత్సరం జీడీపీలో మ్యూచువల్ ఫండ్ల వాటా కేవలం 13శాతం మాత్రమే. ప్రపంచంలో సరాసరిన వీటి వాటా 53శాతంగా ఉంది. మ్యూచువల్ ఫండ్లలో వృద్ధికి చాలా అవకాశాలున్నాయి. యావరేజ్గా నెలకు రూ.4600 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్(సిప్)ల ద్వారా పెడుతున్నారు. ఆగస్టులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో రూ.20వేల కోట్లు వచ్చి చేరాయి. ప్రస్తుతమైతే 35శాతం పెట్టుబడులు ఈక్విటీలోనే ఉన్నాయి. ఇది వచ్చే అయిదేళ్లలో 45శాతానికి చేరుకుంటుందని అంచనా. దీని వల్ల మార్కెట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
6.మార్కెట్లలో పెట్టుబడి ఖరీదైనది కాదు..
జనవరి 2008లో నిఫ్టీ 6357 పాయింట్ల వద్ద ఉండేది. ఆ తర్వాత ఈ ఏడాది 10వేల పాయింట్లను దాటేసింది. దాదాపు 52శాతం పెరిగింది. జీడీపీతో పోలిస్తే నిఫ్టీ చాలా చవకగా కనిపిస్తుంది. మార్కెట్ క్యాపిటల్ టు జీడీపీ నిష్పత్తి ఇవాళ 0.87 వద్ద ఉంది. జనవరి 2008లో అది 1.62గా ఉండేది. సులభంగా చెప్పాలంటే నిఫ్టీ 88శాతం పెరిగినా దాని ప్రమాణంగా ఖరీదు కాదు అని చెప్పొచ్చు. అందుకే ఈక్విటీలో పెట్టుబడులు అందుబాటులోనే ఉన్నాయని చెప్పొచ్చు. రానున్న కాలంలో స్టాక్మార్కెట్లో ప్రయాణం మరింత ఉత్సాహభరితంగా, లాభదాయకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.