Zhifei: డెల్టా వేరియంట్కు చైనా చెక్: మూడు డోసుల్లో వ్యాక్సిన్
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టిన వేళ.. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్స్ ఆందోళనను కలిగిస్తోన్నాయి. భారత్ సహా అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్తో పోల్చుకుంటే ఈ మ్యూటెంట్ మరింత వేగంగా సోకే ప్రమాదం ఉందంటూ ఇదివరకే నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగిస్తోన్న టీకాల ప్రభావం.. డెల్టా వేరియంట్పై పెద్దగా ప్రభావం చూపట్లేదనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
డెల్టా వేరియంట్కు విరుగుడుగా..
ఈ పరిస్థితుల్లో డెల్టా వేరియంట్లను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ను చైనా ప్రపంచానికి పరిచయం చేసింది. డ్రాగన్ కంట్రీకి చెందిన ఛొంగ్క్వింగ్ జిఫెయ్ (Zhifei) బయోలాజికల్ ప్రొడక్ట్స్ దీన్ని అభివృద్ధి చేసింది. డెల్టా వేరియంట్ రకానికి చెందిన కరోనా వైరస్ ప్రభావాన్ని ఈ వ్యాక్సిన్ తగ్గించగలుగుతుందని చైనా వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు ప్రకటించారు.
ల్యాబొరేటరీల్లో తాము చేసిన అధ్యయనంలో ఈ విషయం తెలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విధ్వంసాన్ని సృష్టిస్తోన్న కరోనా వైరస్ కంటే డెల్టా వేరియంట్ మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో- దాన్ని నిర్మూలించడంపై చైనా పరిశోధకలు దృష్టి పెట్టారు.
మూడోదశ క్లినికల్ ట్రయల్స్..
జిఫెయ్ బయోలాజికల్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడు డోసులను తీసుకోవడం వల్ల 1.2 రెట్లు సానుకూల ప్రభావాన్ని చూపిందని నిర్ధారించారు. ఈ వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించిన క్లినికల్ డేటా, రీసెర్చ్ పేపర్లను ఇంకా అధికారికంగా గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ డెల్టా వేరియంట్లపై జిఫెయ్ వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావాన్ని చూపుతుందనే విషయంపై ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని, మూడోదశ క్లినికల్ డేటాకు సంబంధించిన ఫలితాలు ఇంకా అందాల్సి ఉందని పరిశోధకలు స్పష్టం చేశారు.
28 మంది నుంచి సేకరించిన శాంపిళ్లతో
జిఫెయ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం 28 మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. సెకెండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సుదీర్ఘ విరామం అనంతరం మూడో విడత టీకాను తీసుకున్న వారి నుంచి కూడా నమూనాలను తీసుకున్నారు. వాటిపై ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షలన్నీ సానుకూల ఫలితాలను ఇచ్చాయని, డెల్టా వేరియంట్ను న్యూట్రలైజ్ చేయడంతో పాటు దాని ప్రభావాన్ని తగ్గించిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
చైనా, ఉజ్బెక్లల్లో జిఫెయ్ వ్యాక్సిన్
ల్యాబొరేటరీల్లో నిర్వహించిన తమ పరీక్షల సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన ఓ నివేదిక, పేపర్లను శాస్త్రవేత్తలు చైనీస అకాడమీ ఆఫ్ సైన్సెన్ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అధికారులకు అందజేశారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి కొనసాగిస్తోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిఫెయ్ టీకాను వినియోగించడానికి చైనా, ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, అనంతరం మూడో విడత క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన రీసెర్చ్ డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.