Yes Bank: భారీగా క్షీణిస్తున్న యెస్ బ్యాంక్ షేర్.. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి..?
Yes Bank: ప్రైవేటు రంగంలోని యెస్ బ్యాంక్ షేర్లలో నేడు భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో యెస్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఉదయం ఆరంభంలో షేర్ భారీగా 13 శాతం వరకు నష్టపోయింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతోంది.
అమ్మకాల ఒత్తిడి..
రిజర్వు బ్యాంక్ ఆదేశాల ప్రకారం స్టేట్ బ్యాంక్ పెట్టుబడులకు 3 ఏళ్ల లాక్ ఇన్ పిరియడ్ నేటితో ముగిసింది. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మొదలైనవి మూడు సంవత్సరాల లాక్-ఇన్ ముగియడం వల్ల ఈరోజు ఉదయం ప్రారంభ డీల్స్లో యెస్ బ్యాంక్ షేర్ ధర భారీగా నష్టపోయింది. ఉదయం డీల్స్లో యెస్ బ్యాంక్ షేర్లు డౌన్సైడ్ను ప్రారంభించాయి.
ఇంట్రాడేలో స్టాక్..
నేడు మార్కెట్ల ప్రారంభంలో యెస్ బ్యాంక్ షేర్లు భారీగా క్షీణించినప్పటికీ.. తర్వాత 50 శాతం బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ఇంట్రాడేలో స్టాక్ ధర కనిష్ఠంగా రూ.14.40ను తాకింది. ప్రస్తుతం స్టాక్ తిరిగి పుంజుకోవటంతో ఉదయం 11.08 గంటల సమయంలో స్టాక్ నష్టాలు తగ్గి 3.33 శాతానికి పరిమితమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.15.95 వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ ధర తిరిగి పుంజుకోవటం చూస్తుంటే ఇన్వెస్టర్లలో షేర్లపై నమ్మకం పెరిగిందని తెలుస్తోంది.
నిపుణుల మాట..
లాక్ ఇన్ పిరియడ్ ముగియటంతో ప్రైవేటు బ్యాంక్ షేర్లు ఉదయం ట్రేడింగ్ సమయంలో నష్టపోయాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. లాక్-ఇన్ పీరియడ్ ముగియడం అంటే యెస్ బ్యాంక్ షేర్లలో అధిక అస్థిరత ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. ఈ కారణంగా కోట్లాది యెస్ బ్యాంక్ షేర్లు విక్రయించేందుకు ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. స్టేట్ బ్యాంక్ తో కలిపితే ఆఫ్ లోడ్ అయ్యే షేర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆశించవచ్చని అంటున్నారు. అయితే ఇన్వెస్టర్లు ఖచ్చితంగా Q4FY23 యెస్ బ్యాంక్ ఫలితాల కోసం వేచి ఉంటారని వారు చెబుతున్నారు.
షేర్ కొనొచ్చా..
దీర్ఘకాలం కోసం పెట్టుబడులను కొనసాగించాలనుకునే ఇన్వెస్టర్లు యెస్ బ్యాంక్ షేర్లను రూ.15.50- రూ.16 మధ్య రేటులో కొనుగోలు చేయవచ్చని ఆనంద్ రాఠీలోని సీనియర్ మేనేజర్, టెక్నికల్ రీసెర్చ్ గణేష్ డోంగ్రే అభిప్రాయపడ్డారు. స్టాక్ మీడియం టెర్మ్ లో రూ.20-22 స్థాయికి చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు. ఒక వేళ షేర్ రూ.15 కంటే కిందకు పడిపోతే రూ.12-13 కొనుగోలుకు అనువైన రేటని తెలిపారు.