పండుగ సేల్లో అదుర్స్: 68% సేల్స్ ఫ్లిప్కార్ట్వే, అమెజాన్ 32%
వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్ పండుగ సీజన్లో భారీ సేల్స్ నమోదు చేసింది. పండుగ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ మొబైల్ ఫోన్ల నుండి వివిధ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16వ తేదీ నుండి 21వ తేదీ మధ్య జరిగిన ఫస్ట్ వీక్ సేల్లో అమెజాన్ను ఫ్లిప్కార్ట్ అధిగమించింది. మార్కెట్ ట్రాకర్ రెడ్ సీర్ కన్సల్టింగ్ నివేదిక ప్రకారం అమెజాన్ సేల్స్కు దాదాపు రెట్టింపు ఫ్లిప్కార్ట్ విక్రయాలు ఉన్నాయి.
ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంయుక్తంగా 90 శాతం విక్రయాలు సొంతం చేసుకున్నాయి. పండుగ సీజన్లో ఏడు రోజుల్లో 4 బిలియన్ డాలర్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఆన్ లైన్ విక్రయాలు ఈసారి మొదటి వారం 55 శాతం పెరిగాయని తెలిపింది. ఇది రూ.29వేల కోట్లుగా పేర్కొంది. ఈ ఏడాది విక్రయాల్లో 68 శాతం ఫ్లిప్కార్ట్లో నమోదయినట్లు తెలిపింది.
ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య 52 మిలియన్లకు చేరిందని వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 28 మిలియన్లుగా ఉంది. ఈ ఏడాది అంచనాలకు మించి ఆన్లైన్ విక్రయాలు జరిగాయని, పండుగ సీజన్ ప్రారంభంలో ప్రకటించిన అంచనాలు పూర్తిగా మించిపోయాయని రెడ్ సీర్ డైరెక్టర్ తెలిపారు. మధ్యశ్రేణి, చిన్న పట్టణాలకు ఆన్ లైన్ మార్కెట్ విస్తరించినట్లు తెలిపింది.
2019లో పండుగ సమయంలో 28 మిలియన్ల విక్రయాలు కాగా మెట్రోలో 30 శాతం నుండి 35 శాతం, టైర్ 1లో 20 శాతం నుండి 25 శాతం, టైర్ 2లో 45 శాతం నుండి 50 శాతం ఉండగా, ఈసారి (2020) 52 మిలియన్లు కాగా, ఇందులో 25 మిలియన్లు మెట్రోల్లో, టైర్ 1లో 18 మిలియన్లు, టైర్ 2లో 57 శాతంగా ఉంది. అయితే ఈసారి అమెజాన్ సేల్స్ 32 శాతంగా అంచనా వేయగా, ఫ్లిప్కార్ట్ గ్రూప్ సేల్ 68 శాతంగా ఉంది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ సేల్స్లో మింత్ర కూడా వస్తుంది.