సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్, రూ.3.33 లక్షల కోట్ల సంపద పెరిగింది
వరుస భారీ నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు నేడు (మంగళవారం 7 డిసెంబర్) భారీ లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూలత సూచీలకు దన్నుగా నిలిచింది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా సూచీలు కూడా నేడు సానుకూలంగా ఉన్నాయి. ఒమిక్రాన్ భయాల నుండి సూచీలు క్రమంగా బయటకు వస్తున్నాయి.
దీనికి తోడు ఇన్వెస్టర్లు నిన్న కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే, బుధవారం (డిసెంబర్ 8) ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు సానుకూలంగా ఉండవచ్చుననే సూచనలు ఉన్నాయి. అధిక ద్రవ్యోల్భణ ఒత్తిడి వల్ల కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ స్థిరంగా కొనసాగిస్తుందనే సంకేతాలు ఉన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతోంది.
వెయ్యి పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 57,125.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,770.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,992.27 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,044.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,210.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,987.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.మధ్యాహ్నం గం.1.00 సమయానికి సెన్సెక్స్ 805 పాయింట్లు లాభపడి 57,552 పాయింట్ల వద్ద, నిఫ్టీ 234 పాయింట్లు ఎగిసి 17,146 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసింది.
ఇన్వెస్టర్ల సంపద జంప్
నేడు సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు లాభపడిన సమయంలో ఇన్వెస్టర్ల సంపద 3.33 లక్షల కోట్లు పెరిగింది. కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు భారీగా లాభపడ్డాయి. నేడు నష్టపోయిన స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. బీఎస్ఈ 30 స్టాక్స్లో 28 స్టడాక్స్ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్ సూచీలు 2 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు ఒక శాతం చొప్పున ఎగిశాయి.
మూడు నెలల కనిష్టం నుండి..
వరుసగా రెండు రోజులు సూచీలు భారీగా నష్టపోయాయి. దీంతో నిన్న (సోమవారం) సెన్సెక్స్, నిఫ్టీ 1.5 శాతం మేర క్షీణించడంతో ఇవి దాదాపు మూడు నెలల కనిష్టానికి వచ్చాయి. అయితే నేడు మళ్లీ లాభపడటం గమనార్హం. ఇక డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 10 పైసలు పెరిగి 75.36 వద్ద ట్రేడ్ అయింది. క్రూడ్ ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్నాయి.