కస్టమర్ల సేవలకు ఇబ్బందిలేదు: RBI ఆదేశాలపై HDFC, అసలేం జరిగింది?
ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు డిజిటల్ కార్యకలాపాలను, కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గురువారం (డిసెంబర్ 3) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్లో గత నెల చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డుల జారీకి కూడా బ్రేక్ పడింది. దీనిపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్పందించింది.
HDFC బ్యాంకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేయండి, షాకిచ్చిన ఆర్బీఐ, ఎందుకంటే
HDFC బ్యాంకు ఏం చెప్పింది
నవంబర్ 21వ తేదీన బ్యాంకు ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ నిలిచిపోవడంతో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయాయని, అందుకే RBI ఆదేశాలు జారీ చేసిందని HDFC బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ డిసెంబర్ 2, 2020న ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్/చెల్లింపు వినియోగాలలో కొన్ని అంతరాయాలకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసిందని తెలిపింది. కస్టమర్ల సమస్యలను పరిష్కరించి వారికి జవాబుదారీతనంగా ఉండాలని బ్యాంకు బోర్డుకు తెలిపింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ 2లో భాగంగా HDFC బ్యాంకు ప్రవేశపెట్టనున్న అన్ని డిజిటల్ సంబంధ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయాలి. ఇందులో భాగంగా కొత్త క్రెడిట్ కార్డుల జారీ కూడా నిలిపివేయాలి.
గత రెండేళ్లలో మూడుసార్లు అంతరాయం
గత రెండేళ్లలో మూడుసార్లు ఆన్లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సమస్యకు తొలుత పరిష్కారం వెతకాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. గత నెల 21వ తేదీన ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ సరఫరా నిలిచి బ్యాంకు డిజిటల్, ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో పాటు అంతకుముందు రెండుసార్లు జరిగింది. గత ఏడాది డిసెంబర్లో అంతరాయం తలెత్తి రెండు రోజులపాటు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవల్లో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే గత రెండేళ్లుగా ఐటీ వ్యవస్థ పటిష్టానికి పలు చర్యలు చేపట్టామని HDFC బ్యాంకు తెలిపింది.
సర్వీసులకు ఇబ్బందిలేదు
ప్రస్తుత క్రెడిట్ కార్డుల వినియోగ సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ తదతర సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని బ్యాంకు తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా లోపాలను సవరించిన వెంటనే ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు తెలిపింది. రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపదని వెల్లడించింది. ప్రస్తుత కస్టమర్లకు అన్ని సేవలు యథావిధిగా అందుబాటులో ఉటాయని తెలిపింది.
పడిపోయిన స్టాక్
ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో HDFC బ్యాంకు స్టాక్స్ క్షీణించాయి. ఈ బ్యాంకు షేర్ దాదాపు 2 శాతం పడిపోయింది. మధ్యాహ్నం గం.3 సమయానికి 1.81 శాతం క్షీణించి రూ.1,381 వద్ద ట్రేడ్ అయింది. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 15,292 ఏటీఎంలు, 14.9 మిలియన్ల క్రెడిట్ కార్డులు, 33.8 మిలియన్ల డెబిట్ కార్డులు ఉన్నాయి.