ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కేంద్రం ఆ కీలక నిర్ణయంతోను తగ్గేది అంతంతే?
న్యూఢిల్లీ: భారీ వరదలు, వర్షాల కారణంగా ఉల్లిపంట నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ఉల్లి ధరలు రిటైల్ మార్కెట్లో రూ.80 నుండి రూ.100కు పైగా పెరిగింది. ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకున్నది. ఉల్లి దిగుమతి నిబంధనలను సడలించింది. గోదాముల్లోని ఉల్లిని వివిధ రాష్ట్రాలకు తరలిస్తోంది.
గత వారం రోజులుగా కేంద్రం ధరలను అదుపులో ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955ను కేంద్రం ఇటీవల సవరించి, ఉల్లిని ఎసెన్షియల్ కమోడిటీస్ నుండి మినహాయించింది. స్టాక్ పరిమితిని ప్రవేశ పెట్టింది. తద్వారా ఉల్లిని సామాన్యులకు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేస్తోంది.
పండుగ సమయంలో షాక్: ఉల్లి, ఆలు ధరలు ఆకాశానికి, దీపావళి నాటికి అది తగ్గొచ్చు
ఉల్లి ధర ఎందుకు పెరుగుతోంది
ఉత్తర కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు సహా ఉల్లి పండే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. దీంతో పంట నీట మునిగి కుళ్లిపోయింది. అక్టోబర్ మాసంలో వచ్చే పంట మార్కెట్లకు రాకుండానే నీట మునిగింది. ఉల్లి పంటలు ఖరీఫ్ (జూన్-జూలైలో విత్తనాలు వేస్తే అక్టోబర్ నాటికి చేతికి వస్తుంది), లేట్ ఖరీఫ్ (సెప్టెంబర్లో పంట వేస్తే డిసెంబర్ నాటికి వస్తుంది), రబీ (డిసెంబర్-జనవరిలో విత్తనాలు వేస్తే మార్చి నాటికి చేతికి వస్తుంది) పండుతాయి. రబీ పంటలో తేమ తక్కువగా ఉంటుంది. నిల్వ చేయడానికి అనుకూలం. రైతులు, ప్రధానంగా మహారాష్ట్రలో తేమ, కాంతి నుండి రక్షించడానికి కంద చాల్స్ మార్గంలో ఆన్-ఫీల్డ్ నిర్మాణాలలో నిల్వ చేస్తారు.
సెప్టెంబర్లో కురిసిన వర్షాల కారణంగా కర్ణాటకలో పంట మొత్తం నష్టపోయింది. మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నిల్వ చేసిన పంట దెబ్బతిన్నది. అలాగే ఇటీవలి కాలంలో యూరియా ఎక్కువ వాడటంతో ఉల్లి లైఫ్ టైమ్ తగ్గిందని చెబుతున్నారు. ఈసారి యూరియా వాడటంతో గత ఏడాదితో పోలిస్తే ఉల్లి జీవితకాలం తగ్గిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 2018-19లో 7 లక్షల హెక్టార్లలో ఉల్లిపంట ఉండగా, గత ఏడాది నాటికి 10 లక్షలకు పెరిగింది. కానీ అదనపు పంట సరఫరా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో 28 లక్షల టన్నుల్లో ఇప్పుడు 10 నుండి 11 లక్షల టన్నులు మిగిలి ఉన్నాయి. అయితే దేశంలో ఉల్లి వినియోగం 160 లక్షల టన్నులు. మహారాష్ట్ర వినియోగమే రోజుకు 6000 టన్నుల వరకు ఉంటుంది. ఇలాంటి పలు కారణాలతో ఉల్లి ధరలు పెరిగాయి.
ప్రభుత్వం స్పందన ఏమిటి?
ఉల్లి ధరలు పెరగకుండా, కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 14వ తేదీన ఉల్లి ఎగుమతులకు బ్రేక్ వేసింది. స్టాక్ పరిమితులపై చర్యలు తీసుకుంది. ఎగుమతిని నిషేధించిన తర్వాత కూడా ధరలు అదుపులోక రాలేదు. దీంతో దిగుమతి నిర్ణయం తీసుకోవడంతో పాటు గోదాముల్లోని ఉల్లిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇరాన్, టర్కీ తదితర ఉల్లి పండించే దేశాల నుండి దిగుమతి నిబంధనలను సడలించింది. శుక్రవారం స్టాక్ పరిమితిని ప్రవేశపెట్టింది. హోల్ సేల్ వ్యాపారులు ఇప్పుడు 25 టన్నుల వరకు, రిటైల్ వ్యాపారుల వద్ద 2 టన్నుల వరకు స్టాక్ ఉండవచ్చు.
ప్రభుత్వం చర్యలతో ధరలు తగ్గేనా?
ఇరాన్ నుండి ముంబై నౌకాశ్రయానికి ఉల్లి దిగుమతికి రూ.35 ఖర్చు అవుతుంది. రవాణా, హోల్ సేల్, రిటైల్ ఖర్చులు లెక్కిస్తే కిలో రూ.40 నుండి రూ.45 వరకు ఉంటుంది. త్వరలో ఖరీఫ్ పంట రానుందని, అప్పటికి ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో పంట చేతికి వచ్చే అవకాశాలు చాలా చోట్ల తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో నవంబర్ చివరి నాటికి రావొచ్చునని భావిస్తున్నారు. దిగుమతుల కంటే మన దేశంలోని పంట వచ్చినప్పుడే ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. దిగుమతి ఉల్లి రూ.40కి పైగా ఉంటుందని చెబుతున్నారు.